ప్రతిపక్షమో, అధికార పక్షమో పవన్ చెప్పాలి: బొత్స, జెసి వ్యాఖ్యలపై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏకి పారేశారు. రాజకీయ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో మండిపడ్డారు.
జేసీ వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని బొత్స ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలు టీడీపీ ఎంపీల బట్టలూడదీస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఎందుకు?... రూ. 10వేల కోట్లు చాలని సుజానా ఎలా అన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రతిపక్షమో...అధికారపక్షమో చెప్పాలని బొత్స అన్నారు. ప్రత్యేకహోదా అనేది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కావున అందరూ సహకరించాలని కోరారు. కలిసి వస్తే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని బొత్స స్పష్టం చేశారు.
సొంత స్టేటస్ కోసం చంద్రబాబు స్పెషల్ స్టేటస్ను సాధించడానికి చంద్రబాబు పూనుకోవడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదని, రాజకీయ వ్యాపారం కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రకటన ఎపికి సంబంధించింది కాదని చంద్రబాబు అనడాన్ని ఆయన వ్యతిరేకించారు.
సినిమా షూటింగ్ల కోసం 30 ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత కూడా చంద్రబాబు మైండ్ సెట్ మారలేదని ఆయన అన్నారు. ఎపికి కావాల్సింది ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలని ఆయన అన్నారు. తన అవసరాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన అన్నారు.
కేంద్రంలో ఇద్దరు టిడిపికి చెందిన మంత్రులున్నారని, పదవుల కోసం టిడిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని బొత్స అన్నారు.