ఐదేళ్లలో ఏపీ రాజధాని, హైదరాబాద్లా కాకుండా..
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. కొత్త రాజధాని ఏర్పాటుకు దాదాపు 30వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని పైన ఒకవైపు మంత్రుల కమిటీలు, అధికారుల కమిటీలు చర్చోపచర్చలు సాగిస్తుంటే మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగానే సన్నాహాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
రాజధాని నిర్మాణ ప్రాంతంలో అభివృద్ధి, రెండు జిల్లాల అనుసంధానం వంటి అంశాలపై ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసుకుంటున్నారు. రాజధాని సలహాకమిటీ శనివారం సమావేశమై విధి విధానాలు, పలు కీలకాంశాలపై చర్చించింది. వివరాలను చంద్రబాబుకు కమిటీ అందించింది.
రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏర్పాటైన వెంటనే ప్రస్తుతం ఉన్న విజిటిఎం ఉడాను రద్దు చేయనున్నారు. విశాఖపట్నం వుడా స్థానంలోనూ రాజధాని తరహా అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా గుంటూరు - విజయవాడ మధ్య రహదారుల అనుసంధానం, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడటం, ల్యాండ్ పూలింగ్లో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
ఇందులో భాగంగానే రెండు ప్రాంతాలను కలిపేలా మూడు రింగు రోడ్లు నిర్మించనున్నారు. ముందుగా 184 కిలోమీటర్ల రింగు రోడ్డు నిర్మిచనున్నట్టు ప్రకటించగా, ఇప్పుడు మూడు రింగు రోడ్లు ప్రతిపాదించారు. ఇందులో తొలి రింగు రోడ్డును 75 కిలో మీటర్ల విస్తీర్ణంలో, రెండో రింగు రోడ్డును 125 కిలోమీటర్ల విస్తీర్ణంలో, మూడో రింగు రోడ్డును 200 కిలోమీటర్ల పరిధిలో నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూడు రింగు రోడ్లు కారణంగా రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు ఆస్కారం ఉంటుంది.
హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యలను కొత్త రాజధానిలో లేకుండా చూడాలన్న ధ్యేయంతోనే మూడు దశల్లో రింగు రోడ్లను నిర్మించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు రింగ్ రోడ్లకు డిపిఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు) సిద్ధమైనట్టు సమాచారం. త్వరలోనే పనులకు టెండర్లు పిలవాలన్న యోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య అనుసంధానం కోసం వంతెనల నిర్మాణంపైనా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధి మాత్రమే ఉండగా, ఆవనిగడ్డ - రేపల్లె మధ్య మరో వంతెన ఉంది. ఇవి విజయవాడ ట్రాఫిక్ను ఎంతమాత్రం నియంత్రించలేకపోతున్నాయి. అందుకే కొత్తగా మూడు వంతెనలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మంగళగిరి - గొల్లపూడి మధ్య ఒక వంతెన, అమరావతి - ఇబ్రహీంపట్నం మధ్య రెండో వంతెన, అచ్చన్నపేట - కంచికచర్ల మధ్య మూడో వంతెన నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి నిర్మాణం జరిగితే విజయవాడకు ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ విషయంలో రైతులకు ఇచ్చే వాటా పైన 29వ తేదీన స్పష్టత రానుంది.