రాజధాని: మురళీ మోహన్Vsటిజి! విశాఖ అని ఝాన్సీ
హైదరాబాద్: సీమాంధ్రలో రాజధాని వేడి రాజుకుంటుంది. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలంటే తమ ప్రాంతంలో చేయాలని ఆయా ప్రాంతాల నేతలు పార్టీలకతీతంగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, టిడిపి నేత టిజి వెంకటేష్ ఆదివారం మాట్లాడుతూ... కర్నూలును సీమాంధ్ర రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాడు హైదరాబాద్ కోసం తాను కర్నూలును వదులుకున్నామని అంటున్నారు.
కర్నూలుతో పాటు ఎక్కువమంది రాయలసీమ నేతల వాదనల కూడా అలాగే ఉంది. కర్నూలును రాజధాని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండు మూడు నెలల క్రితం రాజధాని చిచ్చు రాజుకుంది. ఆ తర్వాత ఆ రగడ తగ్గుముఖం పట్టింది. అయితే మళ్లీ ఇప్పుడు రాజధాని రగడ ప్రారంభమైంది. శివరామకృష్ణన్ కమిటీ సీమాంధ్ర జిల్లాల్లో రాజధాని కోసం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే పార్టీకి చెందిన వారైనప్పటికీ.. ఆయా ప్రాంతాల నేతలు తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టిజి వెంకటేష్ ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి లోకసభకు టిడిపి తరఫున పోటీ చేసిన మురళీ మోహన్ రాజమండ్రిని రాజధానిగా చేయాలని అంటున్నారు. కాంగ్రెసు పార్టీలోను రాజధాని కోసం పోటా పోటీ నెలకొంది. రాజధానిగా విశాఖ అన్ని విధాలా బాగుంటుందని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తొలి నుండి చెబుతున్న విషయం తెలిసిందే. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలును రాజధాని చేయాలని గతంలో చెప్పారు.
తాజాగా బొత్స ఝాన్సీ విశాఖను రాజధానిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ మహానగరం సీమాంధ్రకు రాజధానిగా ఏర్పాటు చేయడం మరింత అనుకూలమని ఆమె అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్న విశాఖను సీమాంధ్రకు రాజధాని చేయాలని పార్లమెంట్లో ప్రధానమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్టు వెల్లడించారు.