మరో వివాదం: సెక్రటేరియట్లో ఏపీ అధికారిని అడ్డుకున్న టీ ఉద్యోగులు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వివాదానికి సచివాలయం వేదికగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్న బాచిన ఆంజనేయులు అధికార విభజనలో భాగంగా తెలంగాణకు కేటాయించారు.
అంతేకాదు ఆయన ప్రస్తుతం ఏపీ న్యాయశాఖ ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ క్రమంలో, విధుల్లో చేరడానికి నిన్న ఆయన తెలంగాణ సచివాలయానికి వెళ్లారు. దీంతో, తెలంగాణ అధికారులు కొందరు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.
తెలంగాణలో చేరేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేదే లేదన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన వెనక్కి వెళ్లిపోయారు. జరిగిన ఘటనపై ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుకి ఆయన వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారిని తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ తెలంగాణ సచివాలయంలోకి అనుతించబోమని ఉద్యోగులు చెబుతున్నారు.