ఏం జరిగింది?: వేధించి, వెంటాడి ప్రాణం తీసిన కేసులో పురోగతి
విశాఖ: నూకాంబికా అమ్మవారి దర్శనానికి భర్త అప్పలరాజుతో పాటు వెళ్లిన లావణ్య అనే మహిళ మృతి కేసులో పురోగతి కనిపిస్తోంది. నిందితుడు హేమంత్ కుమార్ను ఆదివారం నాడు విశాఖ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించారు. ఏం జరిగిందని అతని నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు.
నూకాంబికా అమ్మవారి దర్శనానికి భర్తతో పాటు వెళ్లి వస్తున్న లావణ్య అనే మహిళను వేధించడమే కాకుండా కారుతో వెంటాడి ఆమె ప్రాణం తీసిన విషయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన హంతకుడు హేమంత్ కుమార్.
భర్తతో కలిసి బైక్ పైన ఆలయానికి వెళ్లి వస్తుండగా నిందితులు ఆమెను వేధించారు. వారి బైక్ను కారుతో ఢీకొట్టారు. దీంతో బైక్ నుంచి పడిన వారికి గాయాలయ్యాయి. బైక్ పై నుంచి పడిన మహిళ లావణ్య మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటన గత ఆదివారం జరిగింది.
వివరాల ప్రకారం... వడ్లపూడికి చెందిన లావణ్య, ఆమె భర్త అప్పలరాజు, ఆమె ఆడపడుచు దివ్య కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో అనకాపల్లికి చెందిన దాడి హేమంత్ కుమార్, అతని స్నేహితులు లావణ్య దంపతులను ఉదయం నుంచి వేధించడం ప్రారంభించారు.
దీంతో హేమంత్ కుమార్, అతని స్నేహితులను లావణ్య భర్త అప్పలరాజు సున్నితంగా మందలించాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు వారిని వెంబడిస్తూ మరింతగా వేధింపులకు గురిచేశారు. అమ్మవారి దర్శనం ముగించుకుని బైక్పై ఇంటికి వస్తున్న లావణ్య దంపతులను కారులో వెనుక నుంచి వెంబడిస్తూ వేధింపులకు గురిచేశారు.
కారుతో రెచ్చిపోయిన పోకిరీలు: వెంటాడి ప్రాణం తీశారు
కాగా, లావణ్య దంపతులు సాలాపువానిపాలెం దాటుతున్న సమయంలో హేమంత్ కుమార్, అతని స్నేహితులు వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి లావణ్య మరణానికి కారణమయ్యారు. కారును పరవాడ వద్ద వదిలి పారిపోయారు. ఇప్పుడు, పోలీసులు ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ను విచారించారు.