మరోసారి రంగంలోకి పవన్ కళ్యాణ్: 10న అనంతలో సభ, వ్యూహాత్మకమా?
అనంతపురం: ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురంలో నవంబర్ 10వ తేదీన సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జనసేన సోమవారం నాడు ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అనంతపురంకు మేలు జరుగుతుందని ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక హోదా, సామాజిక సమస్యల పైన తమ పోరాటం కొనసాగుతుందని తెలిపింది. నవంబర్ 10న హోదా పైన అనంతలో సభ నిర్వహించనున్నట్లు తెలిపింది.
రెండు సభలు అలా..
పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన గతంలో రెండు సభలను నిర్వహించారు. మొదటిది తిరుపతిలో, రెండోది కాకినాడలో నిర్వహించారు. ఇప్పుడు మూడోది అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు గత 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తిరుపతి సభలో పాల్గొన్నారు. ఆ సభలో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తొలి సభను తిరుపతిలో పవన్ నిర్వహించారు. 1997లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసింది. దానిని చెబుతూ రెండో సభను కాకినాడలో నిర్వహించారు. ఇప్పుడు అనంతలో మూడో సభ నిర్వహిస్తున్నారు.
పవన్ది వ్యూహాత్మక అడుగేనా?
నాడు సమైక్యాంధ్ర ఉద్యమం అనంతపురం జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ కూడా భారీ ఎత్తున వినిపించింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉద్యమాలు నిలిచిపోయాయి.
ఇప్పుడు పార్టీ విస్తరణ ప్రణాళికల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తన మూడో బహిరంగ సభ కోసం అనంతపురంను ఎంచుకోవడం ద్వారా వ్యూహాత్మక అడుగు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ తన పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. తొలి రెండు సభలు బీజేపీ హామీ ఇచ్చిన ప్రాంతాల్లో నిర్వహించారు. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకున్నారు.