మంత్రి నారాయణ కొడుకు మృతి: విచ్చలవిడితనంపై జేసీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ మృతి నేపథ్యంలో అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ మృతి నేపథ్యంలో అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నారాయణ తనయుడి మృతికి నేతల సంతాపం
ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం బాగా పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు బార్లకు, పబ్బులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పదకొండు గంటల లోపే పబ్బులు, బార్లు మూసేయాలన్నారు.
పేరెంట్స్కు తెలియకుంటే ఎలా
ఏ మనిషి అయినా ఎవరికో ఒకరికి భయపడాలని జేసీ అన్నారు. భయం లేకుండా పోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ బిజీబిజీగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదన్నారు.
బీజీగా ఉన్నా పిల్లలకు టైం కేటాయించాలి
నేను ఏ ఒక్కరినో తప్పుబట్టడంలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అంతటా ఇలాగే ఉందని చెప్పారు. మీకు (పేరెంట్స్) ఎంత బీజీ ఉన్నప్పటికీ పిల్లలకు సమయం కేటాయించాలన్నారు.
సంపాదించేదే పిల్లల కోసం.. కంట్రోల్ చేయాలి
మీరు (పేరెంట్స్) సంపాదించేదే పిల్లల కోసమని జేసీ అన్నారు. అలాంటప్పుడు వారికి టైమ్ కేటాయించకుంటే ఎలాగని ప్రశ్నించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులకే ఎక్కువ బాధ్యత ఉందని చెప్పారు. నేను కూడా పలుచోట్ల పిల్లల తీరు చూస్తున్నానని చెప్పారు. పిల్లలను కంట్రోల్ చేయాల్సిన అవసరముందన్నారు.
కన్న కొడుకును కోల్పోతే..
మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ ప్రాణాలు కోల్పోవడం పట్ల టిడిపి నేత నందమూరి హరికృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కన్న కొడుకును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని అన్నారు. మూడేళ్ల క్రితం హరికృష్ణ కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా ఆకుపాముల వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
పవన్ కళ్యాణ్ వద్ద కంటతడి
నిషిత్, రాజారవివర్మ కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను చూసి విలపించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. నారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం పోలీసులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా యువత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురు చూస్తుంటారన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.