అంతా తూచ్!: టిడిపితో పొత్తుపై బిజెపి నేతల ఆసక్తికర వ్యాఖ్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం - బిజెపిల మధ్య పొత్తుకు త్వరలో చెల్లు చీటి పడనుందని మీడియాలో చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీని పైన బిజెపి తాజాగా స్పందించింది. ఏపీలో టిడిపితో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇది సీఎం చంద్రబాబుకు ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు.
టిడిపితో తమ పొత్తు త్వరలో ముగిసిపోతుందనేవి కేవలం ఊహాగానాలేనని చెబుతున్నారు. అలాంటి పుకార్లను నమ్మవద్దని అంటున్నారు. టిడిపితో తమ పొత్తు కొనసాగుతుందని మంత్రి కామినేని శ్రీనివాస రావు (బిజెపి ఎమ్మెల్యే), బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు తెలిపారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని, బలం పెంచుకోవాలని టిడిపి, బిజెపిలు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ధీటుగా ఎదిగేందుకు బిజెపి, మరోసారి సొంతగా గెలిచేందుకు టిడిపి పావులు కదుపుతోందని వార్తలు వచ్చాయి.
దీనిపై 'వన్ ఇండియా' ప్రతినిధితో జీవీఎల్ నరసింహా రావు మాట్లాడారు. అవన్నీ వట్టి ఊహాగానాలేనని చెప్పారు. టిడిపితో లేదా మరే పార్టీతోనైనా తమ పొత్తు కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి కామినేని శ్రీనివాస రావు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
టిడిపితో తమ పొత్తు కొనసాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అయితే, రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని మంత్రి, బిజెపి నేత కామినేని చెప్పారు. ఏపీకి కేంద్రం సాయం సరిగా లేదని చెప్పడంలో మాత్రం వాస్తవం లేదన్నారు.
ఏపీకి కేంద్రం నుంచి అన్ని రకాలుగా మద్దతు ఉందని చెప్పారు. ఏపీకి కేంద్రం విభజన హామీలు నెరవేరుస్తుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. టిడిపి, బిజెపి మధ్య పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
ఇరు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పార్టీలు అవసరమైనంత కాలం కలిసే ఉంటాయని చెప్పారు. అయితే, ఏపీలో తమ పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. అయితే, తాము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం లేదని చెప్పారు.