'కక్షతో పవన్కల్యాణ్పై పుస్తకం, కేసీఆర్ మెప్పుకే!', పుస్తకానికి గిరాకీ లేదా?
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన రాజకీయ దురుద్దేశ్యంతోనే బొగ్గుల శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రాశారని పవర్ స్టార్ అభిమాన సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి డీ లక్ష్మణ్, చల్లా శివప్రసాద్ ధ్వజమెత్తారు.
రచయిత శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోవాలని వారు జిల్లా పవన్ కల్యాణ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో శనివారం వైయస్సార్ కూడలి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డీఎస్పీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ మెప్పు కోసమే రచయిత ఇలాంటి దిగజారుడు రాతలు రాశారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఈ పస్తకం రాసినందుకు అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ అప్పట్లోనే ప్రకటించారని గుర్తు చేశారు. ఈ పుస్తకం రాసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ భార్గవ నాయుడుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పవన్ అభిమానులు, జనసేన పార్టీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
పుస్తకానికి గిరాకీ లేదా?
కాగా, పవన్ కల్యాణ్ హఠావో... పాలిటిక్స్ బచావో పుస్తకానికి ఆదరణ లభించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ పుస్తకాన్ని కొనేందుకు ఎవరు ఎక్కువగా మక్కువ చూపడం లేదని అంటున్నారు. బాగా అమ్మకం అవుతుందని, భావించినప్పటికీ అది రివర్స్ అయినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.