ఆ శకలాలు ఏఎన్ 32వి కావు, ఇంకా దొరకలేదు: పారికర్
న్యూఢిల్లీ: చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తూ అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్ 32 ఆచూకీ ఇంకా లభించలేదు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు అహోరాత్రులు గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గురువారం లోకసభలో చెప్పారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదృశ్యం: బంగాళాఖాతంలో శకలాలు అవేనా?
ఈ నెల 22వ తేదీన ఎఎన్ 32 విమానం గల్లంతైన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి పారికర్ లోకసభలో విమానం అదృశ్యంపై తనంతట తానుగా ఓ ప్రకటన చేశారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.
ఉపరితలం అలాగే సముద్ర గర్భంలోనూ విస్తృతంగా గాలింపు జరుగుతోందన్నారు. 13 నౌకలు, 4 కోస్ట్ గార్డ్ నౌకలు, ఒక జలాంతర్గామి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయన్నారు. అన్ని కోణాల్లోనూ గాలింపు జరుపుతున్నామన్నారు.
మంత్రి సముద్రంపై తేలియాడుతూ కనిపించిన చమురుతెట్టు వంటివాటిని నిపుణులు పరిశీలించినా ఫలితం లేకపోయిందన్నారు. ఆ ప్రాంతంలో తేలియాడుతూ 22 వస్తువులు కనిపించాయని అయితే అవి మిస్సయిన విమానానికి సంబంధించినవి కాదని నిర్ధారణ అయిందన్నారు.