షాక్: నేతల మధ్య సమన్వయలోపం, బాబు జోక్యం చేసుకొన్నా, పార్టీకి గుడ్ బై
టిడిపి నాయకుల మధ్య సమన్వయలోపం కొట్టోచ్చినట్టుగా కన్పిస్తోంది. ఎన్నికల ముందు నుండి టిడిపిలో ఉన్న నాయకులకు, ఎన్నికల తర్వాత వైసీపీ నుండి టిడిపిలో చేరిన నాయకుల మధ్య సమన్వయలోపంతో గొడవలు సాగుతున్నాయి. రెండు
అమరావతి:టిడిపి నాయకుల మధ్య సమన్వయలోపం కొట్టోచ్చినట్టుగా కన్పిస్తోంది. ఎన్నికల ముందు నుండి టిడిపిలో ఉన్న నాయకులకు, ఎన్నికల తర్వాత వైసీపీ నుండి టిడిపిలో చేరిన నాయకుల మధ్య సమన్వయలోపంతో గొడవలు సాగుతున్నాయి. రెండు వర్గాలను సమన్వయంతో నడిపించేందుకు పార్టీ నాయకత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఆపరేషన్ ఆకర్ష్ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు కలిసిరాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నాయకుల మధ్య సమన్వయం కోసం పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దరిమిలా కొందరు నాయకులు పార్టీని వీడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడడానికి ప్రధాన కారణమని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
సుదీర్ఘ కాలం పాటు ఫ్యాక్షన్ గొడవలు, ఆధిపత్యపోరుతో రెండు గ్రూపులు, నాయకుల మధ్య విబేధాలు అంత సులువుగా సద్దుమణిగే పరిస్థితి ఉండదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనేది నానుడి.ఆ నానుడి ప్రకారంగా రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ప్రధాన గ్రూపులు , లేదా నాయకులు , వ్యక్తులు టిడిపిలో చేరారు. కారణాలు ఏమైతేనేం వారంతా ఒకేపార్టీలో కొనసాగుతున్నా సానుకూల వాతావరణం మాత్రం లేదు.
గతంలో వేర్వేరు పార్టీల్లో ఉంటూ తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేసిన నాయకులు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉంటూ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. అయితే చాలా సందర్భాల్లో ఇరువర్గాల మద్య రాజీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించక బహిరంగంగానే విమర్శలకు, బాహాబాహీకి దిగుతున్న సందర్భాలు చోటుచేసుకొంటున్నాయి.
సమన్వయలోపంతోనే ఇబ్బందులు
ఎన్నికలముందు నుండి టిడిపిలో ఉన్న నాయకులు, ఇటీవల కాలంలో వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి లో ప్రచ్చన్నయుద్దం కొనసాగుతోంది. అయితే అందరినీ ఏకతాటిమీదికి తెచ్చేందుకు చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో బాబు స్వయంగా జోక్యం చేసుకొన్నా పరిస్థితి సద్దుమణగడం లేదు. ఇవే పరిస్థితులు కొనసాగితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పచ్చగడ్డి వేస్తే అగ్గిరాజుకొంటుంది
ప్రకాశం జిల్లాలోని అద్దంకి, గిద్దలూరు, కర్నూల్ జిల్లా నంద్యాల, కడప జిల్లా జమ్మల మడుగు , అనంతపురం జిల్లా కదిరి , నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి, వైసీపీ నుండి టిడిపిలో చేరిన నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఆధిపత్యం కోసం ఈ రెండు వర్గాల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిపై మరోకరు పై చేయిసాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ అధినేతకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.కొన్ని సమయాల్లో పార్టీ అధినేత తీవ్రంగా మందలించాల్సిన పరిస్థితులు కూడ నెలకొన్నాయి. అయినా కొందరు నాయకుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు.
కరణం వర్సెస్ గొట్టిపాటి
ప్రకాశం జిల్లా అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాల మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. బల్లికురవ మండలం వేమవరంలో చోటుచేసుకొన్న జంట హత్యలతో ఈ రెండువర్గాల మధ్య వివాదాలు మరోసారి తీవ్రమయ్యాయి. ఈ జంటహత్యలను దృష్టిలో ఉంచుకొని టిడిపి జిల్లా మినీ మహనాడులో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ ల వర్గాల మధ్య బాహబాహీ చోటుచేసుకొంది.దీంతో మినీ మహనాడునే వాయిదా వేయాల్సిన పరిస్తితులు నెలకొన్నాయి.ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ గా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఆదినారాయణరెడ్డి తండ్రితో పాటు ఆయన గ్రూప్ కు చెందిన కొందరు రామసుబ్బారెడ్డి వర్గీయుల చేతిలో హత్యకు గురయ్యారని ఆ జిల్లాలో ప్రచారంలో ఉంది. ఆదినారాయణరెడ్డి గ్రూప్ కు చెందిన వారి చేతిలోనే రామసుబ్బారెడ్డి బాబాయితో పాటు మరికొందరు హత్యకు గురయ్యారనే ప్రచారం కూడ ఉంది. ఈ రెండు గ్రూపులు ఒకరిపై మరోకరు కేసులు నమోదుచేసుకొన్నారు.ఈ కేసుల్లో కొన్ని కొనసాగుతున్న పరిస్థితి కూడ లేకపోలేదు.ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే పార్టీ అవసరాలరీత్యా ఆదిని టిడిపిలో చేర్చుకొన్నారు బాబు. మరోవైపు ఆదికి మంత్రిపదవి కట్టబెట్టడంతో పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రామసుబ్బారెడ్డి. అయితే ఈ తరుణంలో ఒకానొకదశలో ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం కూడ సాగింది.కానీ, టిడిపిలో ఉంటానని ఆయన ప్రకటించారు. అయితే ఈ రెండు గ్రూపుల మద్య సయోధ్య కొనసాగడం లేదు.
పార్టీకి గుడ్ బై
కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శిల్పా మోహన్ రెడ్డి భూమా కుటుంబం కారణంగా పార్టీని వీడాల్సిన పరిస్తితులు వచ్చాయి. అంతేకాదు ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపికి గుడ్ బై వైసీపీలో చేరారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చాంద్ బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వర్గాలకు పొసగడం లేదు. నెల్లూరు జిల్లా గూడూరులో మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ కు, ఎమ్మెల్యే సునీల్ మద్య అంతర్గత విబేధాలున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి, టిడిపి నేత రాంబాబు మద్య సఖ్యత లేదు. కందుకూరులో ఎమ్మెల్యే పోతుల రామారావు, దివి శివరాం ల మధ్య కూడ ఇదే రకమైన పరిస్థితి కన్పిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు, జ్యోతుల చంటిబాబుకు మధ్య వర్గ విబేధాలున్నాయి. కాకినాడ ఎంపి తోట నరసింహనికి పార్టీ ఎమ్మెల్యేలకు మద్య పొసగడం లేదు.