రివర్స్: సమన్వయలోపమే వైసీపీకి శాపం, నెల్లూరులో పై చేయికి టీడీపీ ప్లాన్ ఇదే
నెల్లూరు జిల్లా వైసీపిలో నాయకత్వం లోపం కన్పిస్తోంది. పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
నెల్లూరు: నెల్లూరు జిల్లా వైసీపిలో నాయకత్వం లోపం కన్పిస్తోంది. పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ , రెండు పార్లమెంట్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరో వైపు వైసీపీలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.
కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా వైసీపికి కంచుకోటగా పేరుంది.అయితే అలాంటి జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నాయి..
పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కాకాని గోవర్థన్ రెడ్డి పార్టీ నాయకులను సమన్వయం చేయడంలో వైఫల్యం చెందారనే విమర్శలున్నాయి.వైసీలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తమ పార్టీ బలోపేతం కోసం టిడిపి ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ ల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ ప్రభావం పార్టీపై పడుతోంది. పార్టీ జిల్లా ఇంచార్జ్ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అత్యవసర సమయాల్లో మినహా నెల్లూరులో పర్యటించడం లేదు. పార్టీకి గట్టిపట్టున్నప్పటికీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణమిదే
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి నేతల వ్యవహరశైలే కారణమని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని వైసీపీ నేతలు భావించినా జగన్ ఆదేశాల మేరకు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల బాధ్యతలను మేకపాటి గౌతంరెడ్డి తీసుకొన్నారు. మిగిలిన నియోజకవర్గాల ఇంచార్జ్ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు.కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మిగిలిన నియోజకవర్గాల్లో నేతలు శ్రమించినా152 నుండి మెజారిటీని 87 కు తగ్గించారు
ఓటమిపై సమీక్షేలేదు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఓటమికి గల కారణాలను ఆ పార్టీ విశ్లేషించుకోలేదు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలతో , ఎమ్మెల్సీగా పోటీచేసే విజయ్ కుమార్ రెడ్డితో జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు.పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
సమన్వయలోపమే పార్టీకి శాపం
వైసీపికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, జడ్ పి ఛైర్మెన్ ఉన్నా ఎవరికీ వారే యమునా తీరే అనే చందంగా ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కోసం అధినాయకత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు.పార్టీకి జరుగుతున్న నష్టాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని పార్టీ నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
వైసీపికి ధీటుగా టిడిపి వ్యూహారచన
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం టిడిపి ఇప్పటి నుండే వ్యూహారచన చేస్తోంది.ఇటీవల మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలోని అన్నివర్గాలను, నాయకులను సమన్వయం చేసుకొంటూ వెళ్తున్నారు.వచ్చే ఎన్నికల్లో అత్యధికస్థానాల్లో గెలుపే లక్ష్యంగా సోమిరెడ్డి వ్యూహారచన చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేతల వద్దకు వెళ్ళి పలకరిస్తున్నారు. అసంతృప్తులతో చర్చిస్తున్నారు. పార్టీ కార్యకలాలపాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. వైసీపీలో నెలకొన్న పరిస్థితులను అతమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు ప్రతి అవకాశాల్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.