తమ్ముడితో రాజకీయ విబేధాలు, కానీ, రాజగోపాల్ రెడ్డితో లేవంటూ శిల్పా సంచలనం
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఇంచార్జ్ రాజగోపాలరెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఈ నెల 14న, శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరనున్నా
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఇంచార్జ్ రాజగోపాలరెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఈ నెల 14న, శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరనున్నారు.
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో చంద్రబాబునాయుడు నాన్చివేత ధోరణిని నిరసిస్తూనే పార్టీని వీడాల్సివచ్చిందని శిల్పామోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ రాజగోపాల్ రెడ్డితో తనకు విబేధాలు లేవన్నారు శిల్పా మోహన్ రెడ్డి. మూడేళ్ళలో నంద్యాలలో అభివృద్ది పనులే జరగలేదన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నంద్యాలలో చేపట్టిన అభివృద్ది పనులు మినహయిస్తే ఇతర పనులు జరగలేదన్నారు.
అయితే అనేక హమీలిచ్చిన చంద్రబాబునాయుడు వాటిని విస్మరించారని చెప్పారు. రాజకీయంగా తన సోదరుడితో తనకు విబేధాలున్న మాట వాస్తవమేనని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో తనకు వైసీపీ టిక్కెట్టు కేటాయిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పార్టీ ఎవరికీ టిక్కెట్టిస్తే వారికే మద్దతు
ఉప ఎన్నికల్లో పార్టీ ఎవరికి టిక్కెట్టు కేటాయిస్తే వారికే తాను మద్దతివ్వనున్నట్టు చెప్పారు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి. శిల్పామోహన్ రెడ్డి పార్టీ మారినంత మాత్రాన నష్టం లేదన్నారు ఎస్పీవై రెడ్డి.