ముందస్తు ఎన్నికలపై వెంకయ్య స్పందన: నాకు తెలిసిన బాహుబలి ఒక్కరే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు రావొచ్చునని వస్తున్న వార్తలు అన్నీ ఊహాగానాలేనని, అందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు రావొచ్చునని వస్తున్న వార్తలు అన్నీ ఊహాగానాలేనని, అందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ఏ రాష్ట్రానికి ముందస్తు రాదు
ఏ రాష్ట్రానికీ ముందుగానే ఎన్నికలు వస్తాయని తాను భావించడం లేదని, ఏక కాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న ఆలోచన అమల్లోకి రావడానికి ఎంతో కాలం పట్టవచ్చని వెంకయ్య అభిప్రాయపడ్డారు.
కాగా, ఇటీవల ముందస్తు అంశంపై జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందస్తుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, ముందస్తు వచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు దీనిపై వెంకయ్య స్పందించారు.
నాకు తెలిసిన బాహుబలి ఒక్కరే..
తనకు తెలిసిన బాహుబలి ఒక్కరేనని వెంకయ్య నాయుడు అన్నారు. అది ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు. టిక్కెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడుతూ.. ఈ అంశం రాష్ట్రాల పరిధిలో ఉందని తెలిపారు.
మిర్చి రైతుల అంశంపై..
మిర్చి రైతుల అంశాన్ని తాను కేంద్రమంత్రితో చర్చించానని వెంకయ్య చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాలకు సాయం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ గురించి తనకు తెలియదన్నారు.
ట్రిపుల్ తలాక్పై..
ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లీం హిళల హక్కులు కాలరాస్తోన్నారని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వరుసగా బీజేపీ గెలుస్తున్నప్పటికీ.. ప్రతిపక్షాలకు ప్రజా తీర్పు అర్ధం కావడం లేదన్నారు.
చాలామంది సొంత ఇంటి కోసం ఎదురుచూపు
రేపటి నుంచి అమల్లోకి రానున్న స్థిరాస్తి నియంత్రణ చట్టం గురించి వెంకయ్య మాట్లాడారు. నిర్మాణ రంగంలో ఇకపై కొనుగోలుదారుడే రారాజని చెప్పారు. సొంత ఇంటి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారన్నారు. కొత్త చట్టం ద్వారా స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాలు పుంజుకుంటాయన్నారు.
నవీన భారతావని నిర్మాణం కోసం ప్రతిపక్షాలు కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. దర్శకుడు కే విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.