ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గలేదు, 9రాష్ట్రాలు అడుగుతున్నాయి: వెంకయ్య
ఎస్పీఎస్ నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నాడు మరోసారి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రం వెనక్కి తగ్గలేదని ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విలేకరుల సమావేశంలో చెప్పారు.
ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలపై తాను ఇటీవలే నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమై గంటకు పైగా చర్చించానని చెప్పారు. ఏపీకి సాయంపై నీతి ఆయోగ్ కమిటీ ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక ఇస్తుందని చెప్పారు.
దాని ఆధారంగా ప్రధాని మోడీ ప్రకటన చేస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. సెప్టెంబర్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గమని చెప్పారు.
దేశంలో వైద్యం ఇంకా వెనుకబడే ఉందని, ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకు రావాలని వెంకయ్య అన్నారు. జిల్లాలోని వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల దాడిలో చిన్నారి మృతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో కింది నుంచి పై స్థాయి వరకూ సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. వైద్యుల కొరత తీర్చేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించామన్నారు. వైద్యం, విద్య ఖర్చులు పెరిగిపోవడం కూడా రైతుల ఆత్మహత్యలకు ఓ కారణమన్నారు.