ఆనం సోదరుల పార్టీ మార్పును తేలిగ్గా కొట్టేసిన రఘువీరా
ఒంగోలు: ఆనం సోదరులు తమ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి తేలిగ్గా కొట్టేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి పార్టీ మారుతున్న విషయంపై ఆయన పరోక్షంగా స్పందించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఆయన అన్నారు.
ఎవరు పార్టీని వీడినా తమ పార్టీకి నష్టమేమీ లేదని ఆయన అన్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రమైన భైరవకోనలో ఆయన సోమవారం మట్టి సత్యాగ్రహం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగే విధంగా లక్ష ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి పంపుతామని ఆయన చెప్పారు.
భైరవకోనలో జరిగిన మట్టి సత్యాగ్రహంలో ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు ఉగ్రనరసింహా రెడ్డితో పాటు పలువురు కాంగ్రెసు నాయకులు పాల్గొన్నారు.
తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆనం సోదరులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఆనం వివేకానంద రెడ్డిని చేర్చుకోవడంపై తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నట్లు సమాచారం. అయితే, ఆనం సోదరులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.