ఛీ కొడతారు: రావెల, అన్నీ అబద్దాలే: జగన్
హైదరాబాద్/జగన్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలు ఛీకొడతారని మంత్రి రావెల కిషోర్ శుక్రవారం అన్నారు. జగన్ తలకిందులుగా యాత్ర చేసినా ప్రజల ఆయనను నమ్మరన్నారు. ఆయనది బూటకపు యాత్ర అన్నారు.
తమ పార్టీ ఉనికి కోసమే జగన్ బస్సుయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకే పట్టిసీమ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందన్నారు. తమ పార్టీ యువనేత నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల కోసమే యాత్ర చేపట్టారన్నారు.
చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్ జగన్ కర్నూలులో ధ్వజమెత్తారు. పెండింగు ప్రాజెక్టులను సందర్శిస్తున్న జగన్ శుక్రవారం నాడు బానుకచర్ల హెడ్ రెగ్యులరేటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పోతిరెడ్డిపాటు నుండి బానుకచర్లకు 44వేల క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా, 3 నుండి నాలుగు వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పైన చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలే అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టులకు సరైన నిధులు కేటాయించలేదన్నారు. అంతేకాకుండా, కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేదన్నారు. నిధుల కేటాయింపులో రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందన్నారు.