ఏ పార్టీలోనూ చేరడం లేదు: తేల్చేసిన కొణతాల రామకృష్ణ
విశాఖపట్నం: తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మార్తున్నట్లు వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే కార్యకర్తలతో మాత్రం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గతంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చారు. తెలుగుదేశ పార్టీలో, బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. అయితే, ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. తిరిగి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యునిగా ఉన్న కొణతాల రామకృష్ణను పార్టీ నుంచి తొలగిస్తూ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరుడు అక్టోబర్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అప్పట్లో వెల్లడించారు.
కొణతాల ప్రధాన అనుచరుడైన గండి బాబ్జీ కూడా పార్టీకి దూరమయ్యారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ వచ్చినప్పుడు పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జిగా ఉండి కూడా గండి బాబ్జీ హాజరు కాలేదు. సహాయక చర్యల్లో కూడా పాల్గొనలేదు. దీంతో బాబ్జీని నియోజకవర్గ ఇంచార్జిగా తొలగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
బాబ్జీని ఇంచార్జిగా తొలగించడాన్ని సహించలేని కొణతాల అప్పట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను జగన్కు మెయిల్ ద్వారా పంపించారు. తను పార్టీలో ఉండడం ఇష్టం లేదనుకుంటే, దానికి కూడా రాజీనామా చేస్తానని కొణతాల అదే లేఖలో చెప్పారు. అప్పటి నుంచి కొణతాల రామకృష్ణ అన్ని పార్టీలకూ దూరంగానే ఉంటూ వస్తున్నారు.