తెరాసలోకి ఎమ్మెల్యే ధర్మారెడ్డి, రాజకీయంకాదు: కేసీఆర్
హైదరాబాద్: వరంగల్ జిల్లా పరకాల టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెరాసలో చేరికలను రాజకీయ అంశంగా చూడవద్దని అందరికీ హితవు పలికారు.
బంగారు తెలంగాణ కోసం నేటి తరం కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా అందరం ఏకం కావాలని ఆయన అన్నారు. పింఛన్ల కోసం తమ ప్రభుత్వం ఏటా రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తుందని కేసీార్ చెప్పారు.
ధర్మారెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తన అనుచరులతో కలిసి కారు ఎక్కారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము ఒక్కటొక్కటిగా అమలు పరుస్తున్నామని చెప్పారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు.
తెలంగాణ రాజకీయ శక్తి ఏకోన్ముఖంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ధర్మారెడ్డి తెరాసలో చేరారని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
సభను అడ్డుకుంటే సస్పెండ్ చేసైనా: హరీష్ రావు
అసెంబ్లీని అడ్డుకుని, గందరగోళం సృష్టించే వారిని సస్పెండ్ చేసైనా సరే సభా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ముందురోజు చెప్పారు. తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ గాలి పీలుస్తూ, తెలంగాణ తిండి తింటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వంతపాడుతున్నారన్నారు.
కావేరి జలాల కోసం తమిళనాడు మొత్తం ఏకమైన సంగతిని తెలంగాణ టీడీపీ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మరోవైపు కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డి పైనా కూడా హరీష్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్న జానారెడ్డి తన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని, ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయలేదా? అని ప్రశ్నించారు.