'జగన్ కాదు.. నారా లోకేష్ ఆంధ్రా శశికళ, చంద్రబాబు ఆంధ్రా జయలలిత'
జగన్ ఆంధ్రా శశికళ అన్న టిడిపి నేతల వ్యాఖ్యల పైన వైసిపి శుక్రవారం నాడు ఘాటుగా స్పందించింది.
చెన్నై: వైసిపి అధినేత వైయస్ జగన్ ఆంధ్రా శశికళ అన్న తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రా జయలలిత అని, ఆయన తనయుడు నారా లోకేష్ ఆంధ్రా శశికళ అని వైసిపి నేత వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
అవినీతిలో కూరుకుపోయిన టిడిపి నేతలు జగన్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు ఆయనకు ఎంత ఆస్తి ఉందో చెప్పాలన్నారు.
పళనిస్వామి కేబినెట్లో తొలిసారి గెలిచిన తెలుగోడికి ఛాన్స్
రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు రూ.2 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చారని నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన చంద్రబాబుకు జగన్ను విమర్శించే హక్కు లేదన్నారు.
ఓటుకు నోటు కేసుకు భయపడే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారన్నారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు హోదా విషయంలో ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు.
గుంటూరులో జరిగిన యువభేరీలో పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పలేరన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీలోకి అనైతికంగా చేర్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. జగన్ పైన లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు.