టీడీపీ వ్యూహం: నంద్యాల ఛైర్పర్సన్ సులోచనకు చెక్, ఇందుకేనా?
నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
కర్నూలు: నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దేశం సులోచన ప్రస్తుతం నంద్యాల ఛైర్ పర్సన్ పదవిలో కొనసాగుతున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ భారీ వ్యూహాలను రచిస్తోంది.
అప్పుడు టీడీపీదే మెజార్టీ..
2014లో నంద్యాల పట్టణంలోని మొత్తం 42 వార్డుల కు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కొత్తగా టీడీపీలో చేరిన శిల్పా మోహన్రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను తీసుకున్నారు. ఈ ఎన్ని కల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు భూమా నాగిరెడ్డి కృషి చేశారు. ఎన్నికలు జరిగిన మొత్తం 42 వార్డుల్లో 29 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 13 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుతం శిల్పామోహన్ రెడ్డి పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్యా బలం 16కే పరితమైంది.
అప్పుడు తెరపైకి సులోచన
నంద్యాల రాజకీయాల్లో ఆర్యవైశ్య ప్రముఖుడు, తనకు అత్యంత సన్నిహితుడైన గంగిశెట్టి విజయ్కుమార్ కుటుంబానికి చైర్మన్ పదవి ఇవ్వాలని శిల్పా మోహన్రెడ్డి నిర్ణయించి గంగిశెట్టి తమ్ముడి భార్యను కౌ న్సిలర్గా పోటీ చేయించారు. అయితే శిల్పా నివాసం ఉంటున్న సొంత వార్డులో గంగిశెట్టి మరదలు గెలవకపోవడం, చైర్మన్ పదవి చేజారడంతో వైస్ చైర్మన్గా విజయ్కుమార్ను ఎన్నుకున్నారు. శిల్పాకు సన్నిహితుడైన మరో నేత దేశం సుధాకర్రెడ్డి భార్య సులోచన కౌన్సిలర్గా గెలవడంతో చైర్మన్ పదవిని ఆమెకు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఎమ్మెల్యే హోదాలో భూమా నాగిరెడ్డి పాల్గొన్న ఒక కౌన్సిల్ సమావేశంలో జరిగిన గొడవ అప్పుడు సంచలనమైంది. కౌన్సిల్ సమావేశంలో జరిగిన గొడవలో కౌన్సిలర్ భీమనపల్లె వెంకటసుబ్బయ్యకు తలకు గాయం కావడం, అనంతరం వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్కుమార్పై దాడి జరగడం కలకలం రేపాయి. తదనంతర పరిణామాల్లో తనకు మున్సిపాలిటీలో ప్రాధాన్యత తగ్గించడం, మున్సిపల్ చైర్పర్సన్కు పెత్తనం అప్పజెప్పారన్న అసంతృప్తితో వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ రాజకీయంగా శిల్పాకు దూరమయ్యారు.
భూమా చేరికతో...
భూమా నాగిరెడ్డి టీడీపీలోకి చేరాక గంగిశెట్టి విజయ్కుమార్ ఇంటికి మాజీ మంత్రి ఫరూక్తో కలిసి నేరుగా వెళ్ళి సంప్రదింపులు చేశారు. ఇలా వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్కుమార్ శిల్పా వర్గం నుంచి బయటకు వస్తూ తనతో పాటు తనకు అనుకూలంగా ఉన్న ఐదుగురు కౌన్సిలర్లను తీసుకొని వచ్చి భూమా వర్గంలో చేరారు. దీంతో భూమా వర్గం ఎన్నిక ల్లో గెలిచిన 13 కౌన్సిలర్లల్లో ఒకరు(వైసీపీ ఇంఛార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్రెడ్డి భార్య లలితమ్మ) మినహా మిగిలిన 12 మందికి ఈ ఆరుగురు కలిసి వారి సంఖ్యాబలం 18 అయింది.
శిల్పా జగన్ పార్టీలో చేరినా..
తెలుగుదేశం పార్టీకి శిల్పామోహన్రెడ్డి గుడ్బై చెప్పేందుకు నిర్వహించిన కార్యకర్త ల అభిప్రాయ సభకు ముగ్గురు కౌన్సిలర్లు హాజరు కాలేదు. 9వ వార్డు కౌన్సిలర్ పడ కండ్ల సుబ్రహ్మణ్యం, 11వ వార్డు కౌన్సిలర్ కత్తిశంకర్, 37వ వార్డు కౌన్సిలర్ మామిడి ఉషారాణి.. శిల్పా వెంట వెళ్లేందుకు నిరాకరించి సభకు హాజరుకాలేదు. నాయకులు పార్టీలు మారినప్పటికీ తామంతా కార్యకర్త లుగా పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో పని చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచామని, టీడీపీలోనే ఉంటాం తప్ప వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో ప్రస్తుతం టీడీపీలో ఉన్న భూమా, ఫరూక్ వర్గాల కౌన్సిలర్ల సంఖ్యా బలం 21కి చేరింది. అయితే, సులోచన మాత్రం ఆయన వెంటే వైసీపీలో చేరారు. కాగా, టీడీపీ తరపున గెలిచి వైసీపీలో చేరిన శిల్పా వర్గా నికి చెందిన కౌన్సిలర్లందరికీ పార్టీ తరపున నోటీసులు జారీ చేయాలని సీఎం చంద్రబాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఇప్పటికే ఆదేశించారు.
ఛైర్ పర్సన్ పదవిలో మనమే ఉండాలి
సీఎం చంద్రబాబు నాయుడు నంద్యా ల పర్యటన సందర్భంగా రాజకీయ సమీకరణలు వేగంగా జరిగాయి. ఇందులో శిల్పా పక్షాన ఉన్న 15వ వార్డు కౌన్సిలర్ గుండ్రాతి అరుణాదేవి, 12వ వార్డు కౌన్సిలర్ హనీఫ్, 17వ వార్డు కౌన్సిలర్ చంద్రావతి, 14వ వార్డు కౌన్సిలర్ మధుసాయి, 35వ వార్డు కౌ న్సిలర్ షేక్ మహాబూబ్బీ తామంతా అధికా ర పార్టీ పక్షానే నిలబడతామని స్పష్టం చేసి సీఎం సమక్షంలో బలప్రదర్శనకు హాజరయ్యారు. టీడీపీ పక్షాన ప్రస్తుతం 26 మంది కౌన్సిలర్లు ఉన్నారని, చైర్పర్సన్ పదవి నుంచి దేశం సులోచనను దించేయాలని కౌన్సిలర్లు సీఎం చంద్రబాబును కోరారు. ఈ క్రమంలో మున్సిపల్ కౌన్సిల్లో సంఖ్యా బలం పెరిగిన అధికార పార్టీ చైర్పర్సన్ పదవి టార్గెట్గా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అఖిలప్రియ ఈ అంశంపై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.