జేసీ దివాకర్ రెడ్డి: బాబు నుంచి జగన్ వరకూ.. అందరిపై ఇలాగే
అనంతపురం టిడిపి నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడుతారని అంటారు. గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో గొడవ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన తన తీరును మార్చుకోలేదు.
అమరావతి: అనంతపురం టిడిపి నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడుతారని అంటారు. గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో గొడవ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన తన తీరును మార్చుకోలేదు.
చదవండి: నిషేధం: జేసీకి ఎయిరిండియా-ఇండిగో షాక్, చంద్రబాబు సీరియస్
రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కానే కాదని కుండబద్దలు కొట్టి చంద్రబాబుకే షాకిచ్చారు. ముఖ్యమంత్రి ఎదుటనే ఆ వ్యాఖ్యలు చేశారు. దానికి చంద్రబాబు కూడా కౌంటర్ ఇవ్వడం వేరే విషయం. తాను పూర్తి చేసి చూపిస్తానని చెప్పారు.
ఈ ఒక్క విషయమేకాదు కాంగ్రెస్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనది అదే తీరు. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వెనుకాడరు. ఇక విపక్ష నేతలపై చేసే విమర్శల్లోనూ జేసీ ఎలాంటి పరిమితులు పెట్టుకోరు.
ఆయన దూకుడుగా ఉంటారు కాబట్టే ప్రసంగాలు తరుచూ వివాదాస్పదమవుతుంటాయి. అయినా సరే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. హుషారుగా, వ్యంగ్యంగా మాట్లాడడంలో జేసీ దిట్ట. ఎవరి మీదైనా సైటైర్లు వేయాలంటే ఎలాంటి మొహమాటం లేకుండా వేసిపాడేస్తారు.
అందుకే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఉంటుంది. అయితే ఇదంతా స్నేహ పూర్వకంగా ఉంటుందని అంటున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పైన కూడా ఆసక్తికర కామెంట్లు ఎన్నో చేశారు. వివాదాస్పద కామెంట్లు కూడా చేశారు.
ఇదిలా ఉండగా జేసీ ముక్కుసూటి తనం అప్పుడప్పడూ ఇబ్బంది తెచ్చిపెడుతూ ఉంటుంది. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జేసీ.. మంత్రి పదవి దక్కకపోవడానికి ఈ తీరే కారణమనే వాదనలు ఉన్నాయి.
యూరోప్ టూర్కు జేసీ దివాకర్ రెడ్డి
జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం యూరోప్ పర్యటనకు వెళ్లారు. ఆయనపై ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆయనపై ఆ తర్వాత మొత్తం ఏడు ఎయిర్ లైన్స్ నిషేదం విధించాయి.