చిరంజీవిపై డౌటా, ఎప్పటికీ మా వాడే: రఘువీరా ధీమా
విజయవాడ: రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ తమ పార్టీ నాయకుడేనని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. అనుకోని కారణాల వల్ల చిరంజీవి కార్యక్రమాలకు హాజరవడంలేదని ఆయన తెలిపారు. ఏపీ పీసీసీ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో రఘువీరా రెడ్డి పాల్గొన్నారు.
151 నియోజకవర్గాల్లో మండలస్థాయి కమిటీలు వేశామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కమిటీలు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందనివారి జాబితా తయారు చేస్తాయని ఆయన చెప్పారు. ఈ రెండేళ్లలో జరిగిన అవినీతిపై ఆందోళనలు చేపడుతామన్నారు.తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు ఆపేవరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జులైలో విశాఖ మన్యంలో రాహుల్ భరోసా యాత్ర చేపడుతున్నట్లు రఘువీరా తెలిపారు.
2019తో తెలుగుదేశం పార్టీ ఆయుష్షు ముగిసిపోతుందని చెప్పారు. 2050 వరకు తానే ముఖ్యమంత్రిని అంటూ చంద్రబాబు కలలు కంటున్నారని ఆయన అన్నారు. రెండేళ్లలో టిడిపి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. దీనిపై జూన్లో సిఈసికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆయన విమర్శించారు.
ఇదిలావుంటే, ఏపీకి ప్రత్యేకహోదా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి శనిలా పట్టుకుందని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. రాజస్థాన్ వెళ్లినా వెంకయ్యను వదిలే ప్రసక్తేలేదని ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో అన్నారు. బెంగాల్లో వ్రతం చెడినా ఫలితం దక్కలేదని అన్నారు.
కాంగ్రెస్తో పొత్తు వద్దని సీపీఎంకు అంతర్గతంగా సూచించామన్నారు. మా భాష, మా విధానాలు మారాల్సి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఫిరాయింపులకు ఆద్యుడు వైఎస్సే అని నారాయణ అన్నారు.