రాయపాటిని వైట్హౌజ్కు ఆహ్వానించిన ఒబామా
గుంటూరు: నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అధికారిక నివాసం వైట్హౌస్కు ఆహ్వానించారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు కార్యాలయం వెల్లడించింది.
సోమవారం రాష్ట్రపతి భవన్లో రాయపాటి సాంబశివరావు.. బరాక్ ఒబామాను కలిసి తిరుపతి లడ్డూ ప్రసాదం అందించారు. ప్రత్యేకంగా తయారు చేసిన శాలువాను బహుకరించారు. బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామాకు అపురూపమైన ముత్యాల హారాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఒబామా దంపతులు రాయపాటి సాంబశివరావుకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక వైట్హౌజ్కు వచ్చి తమ ఆతిథ్యం అందుకోవాలని రాయపాటిని ఒబామా ఆహ్వానించారు. 2010లో భారత్లో పర్యటించిన సమయంలోనూ బరాక్ ఒబామాకు బంగారంతో తయారు చేసిన అరుదైన రుద్రాక్ష హారాన్ని రాయపాటి సాంబశివరావు బహుకరించారు.
కాగా, పాత పరిచయంతోనే ఒబామా తన తాజా పర్యటనలో రాయపాటిని గుర్తుంచుకుని స్వయంగా పలకరించారు. తనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి వ్యక్తిగతంగా ఆహ్వానం రావడం ఎంతో సంతోషంగా ఉందని రాయపాటి సాంబశివరావు తెలిపారు. తాను చాలా సార్లు అమెరికా వెళ్లానని, అయితే తన తదుపరి అమెరికా పర్యటన మాత్రం ప్రత్యేకంగా ఉండనుందని చెప్పారు.