మదనపల్లె ప్రైవేట్ స్కూల్లో ఘోరం, పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య
అమరావతి: చిత్తూరు జిల్లాలోని ఓ ప్రవైట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. గుర్రంకొడంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ బిల్డింగ్ కూలడంతో ఓ విద్యార్ధిని మృతి చెందగా, 10 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే, బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా బిల్డింగ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘనటలో హర్ష అనే విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. గాయపడిన విద్యార్ధులను సమీపంలోని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
స్కూలు బిల్డింగ్ వందేళ్లకు పైబడిన పురాతన కట్టడం కావడం, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పైకప్పు కూలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు మాత్రం విద్యాశాఖ అధికారులే నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం స్కూలు యాజమాన్యం పరారీలో ఉందని, వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది ఇలా ఉంటే బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
తిరుపతిలో స్కూల్పై నుంచి పడిన విద్యార్థి
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. స్టడీ అవర్ ఉందంటూ ఉదయమే స్కూల్కు వెళ్లిన హరికృష్ణారెడ్డి కాసేపటికే స్కూల్ భవనంపై నుంచి పడిపోయాడని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు.
అతడి పరిస్థితి విషమంగా ఉంది. పద్మావతిపురంకు చెందిన మునికృష్ణారెడ్డి కుమారుడు హరికృష్ణారెడ్డి అనే విద్యార్ధి అన్నమయ్య కూడలిలో ఉన్న రవీంద్ర స్కూల్ పదో తరగతి చదువుతున్నాడు. హరికృష్ణను మొదట రుయాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో స్విమ్స్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య
జైలు నుంచి తన భర్త విడుదల కాలేదని మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు పిల్లలకు ఉరేసి తాను బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్ల పల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే
గ్రామానికి చెందిన మాధవి (24)కి ముదిగుబ్బ మండలం కొడవళ్లపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొన్ని నెలలుగా ఆమె భర్త ఓ హత్యకేసులో అనంతపురం జిల్లా సబ్ జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి మాధవి తన పుట్టింటి వద్దనే ఉంటుంది.
నెలలు గడుస్తున్నా తన భర్త జైలు నుంచి విడుదల కావడం లేదనే మనస్తాపానికి గురైన మాధవి బుధవారం ఉదయం పిల్లలిద్దరికీ ఉరేసి తాను ఉరేసుకుంది. ఈ ఘటనలో కూతురు భాను (5) ప్రాణాలతో బయటపడగా, కుమారుడు లోకేశ్వర్ రెడ్డి (3) మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం భానును అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.