టెక్కీ కొడుకుని చంపిన చిన్నాన్న, జడ్జి కేసులో ట్విస్ట్..
గుంటూరు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో ఏడాదిన్నర వయసు ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు గురువారం ఉదయం గుర్తించారు. బాలుడు తెనాలికి చెందిన మోక్షజ్ఞతేజగా గుర్తించారు. ఆ బాలుడు పొన్నూరు పోలీసు స్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్న రాంబాబు మనవడిగా గుర్తించారు.
అతనిని బాబాయి హరిహరణ్ కిడ్నాప్ చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మోక్షజ్ఢతేజ తండ్రి హైదరాబాదులో సాఫ్టువేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. అతని పేరు భాస్కర్. కుటుంబ వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. తాతయ్య వద్ద ఉంటున్న బాలుడిని ఈనెల 24న హరిహరణ్ కిడ్నాప్ చేశాడు.
మహిళా జడ్జికి వేధింపులు: భర్త అరెస్టు
ఓ మహిళా జడ్జికి అదనపు కట్నం వేధింపులు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మియాపూర్ 16వ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి శ్రీదేవి భర్త జితేంద్ర పైన అనంతపురం నగర టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం తన భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు మేరకు జితేంద్రతో కుటుంబ సభ్యుల పైన కేసు నమోదు చేశారు. జితేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో ఉంటున్న జితేంద్ర కాంట్రాక్టర్. శ్రీదేవితో ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లయ్యాక కొన్నాళ్లకే వారి మధ్య విభేదాలు వచ్చాయి.
మరోవైపు తన భార్య తండ్రి, మరొక వ్యక్తితో కలిసి వచ్చి తన ఇంటిపై దాడి చేశారని జితేంద్ర కూడా ఫిర్యాదు చేశారు. ఆస్తినంతా అమ్ముకొని, తల్లిదండ్రుల్ని వదిలి హైదరాబాదు రావాలని తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు. ఆమె చెప్పినట్టు వినక పోవడంతో తన పైన కేసు పెట్టారని పేర్కొన్నారు. జడ్జి పైన కేసు కావడంతో న్యాయమూర్తి అనుమతి కోసం అర్జీ పెట్టారని తెలుస్తోంది.