రిషికేశ్వరి పేస్బుక్ పేజీ: ప్రశ్నాస్త్రాలు, తలొగ్గిన ప్రభుత్వం
గుంటూరు: ఆచార్య నాగార్జున విద్యార్థిని విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించి ''వీ వాంట్ జస్టీస్ ఫర్ రిషికేశ్వరి- రైజ్ యువర్ వాయిస్ కమ్యూనిటీ'' పేరిట గల ఫేస్ బుక్ పేజీకి విశేషమైన స్పందన లభిస్తోంది. ర్యాంగింగ్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన రిషికేశ్వరి ఫేస్ బుక్ పేజీకి 14వేల మంది సభ్యులుగా ఉన్నారని తెలిసింది. ఈ పేజీలో రిషికేశ్వరి సూసైడ్, కేసు పురోగతి వంటి ఇతరత్రా వివరాలున్నాయి.
ఇంకా రిషికేశ్వరి ఆత్మహత్యపై నెటిజన్స్ విభిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. ఫేస్ బుక్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య విషయాన్ని ముందుగా గర్ల్స్ హాస్టల్ కంటే ముందుగా బాయ్స్ హాస్టల్కు ఎలా చేరిందని నిలదీస్తున్నారు.
లేడిస్ హాస్టల్ వారెడ్న్ కన్నా ముందు బాయ్స్ హాస్టల్కు ఈ వివరాలు ఎలా చేరాయని, కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా డ్రామా, కాలేజీకి పది రోజులు సెలవులు ప్రకటించజం వంటి అంశాలపై నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. విశ్వవిద్యాలయం నిర్మానుష్యమైంది.
కుల ప్రాతిపదికపై వెలసిన బోర్డులను విశ్వవిద్యాలయం ఆవరణలోంచి తొలగించారు. గుర్తింపు కార్డులు, అనుమతి లేకుండా విశ్వవిద్యాలయం ఆవరణలోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఆదివారం ఉదయం నుంచి రిషికేశ్వరి విషాదకరమైన సంఘటనపై ఫేస్బుక్ ప్రచారం సాగిస్తున్నారు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభించాలని కోరుతూ గవర్నర్కు విద్యార్థులు ఈమెయిల్స్ పంపించారు.
ఫేస్బుక్ పేజీ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల వంచి, రిషికేశ్వరి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశించింది. రిషికేశ్వరి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం పది లక్షల రూపాయల చెక్కును అందించింది. రిషి మృతిపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బాలసుబ్రహ్మణం నేతృత్వంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ కమిటీని వేసింది. ఈ కమిటీలో ఎస్వీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బాలకృష్ణమ నాయుడు, సింహపురి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీరయ్య, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు విజయలక్ష్మి సభ్యులుగా ఉంటారు.