జగన్ది తప్పు కాదు కానీ: ప్రత్యేక హోదాపై మరోసారి జెసి బాంబు
అనంతపురం: మాజీ మంత్రి, అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రత్యేక హోదా పైన మరోసారి సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లోను రాదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీయే గతి అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, కానీ కేంద్రం మాత్రం ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు. విభజన సమయంలో తాను రాయల తెలంగాణ కోరితే ఎవరు మద్దతివ్వలేదన్నారు. రాజకీయ నిరుద్యోగులే రాయలసీమపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆదివారం నాడు కూడా జెసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పాటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం సహా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. కేంద్రం, ఏపీ... రెండు ప్రభుత్వాలు తమ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్తబ్ధత నెలకొన్న ఈ కారణంగా ప్రజలు సంతోషంగా లేరన్నారు. రానున్న ఏడాదిలో ప్రభుత్వ పరిపాలనలో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు విజయవాడలోను, అధికార యంత్రాంగం హైదరాబాదులోను ఉండటం వల్లే పాలన గాడి తప్పుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాలనలో స్తబ్దత ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని జెసి వ్యాఖ్యానించడం గమనార్హం. ఏపీలో ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నారు.