ఇక చంద్రబాబును ఆ మాట అనే సాహసం చేయరు!
విజయవాడ : ఇన్నాళ్లు ఏపీ సీఎం చంద్రబాబుపై ఓ అపవాదు ఉండేది. ప్రతిపక్షాలు సైతం సందర్బం వచ్చిన ప్రతీసారి.. 'కరువు-చంద్రబాబు..' రెండూ కవలల పిల్లలు అంటూ ఆయన్ను దుయ్యబట్టేవారు. అయితే ఇకనుంచి వాళ్లకు ఆ మాట అనే అవకాశం లేకుండా పోయింది. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చే ఏడాది వరకు సాగునీటికి, తాగునీటికి ఇక ఇబ్బంది తలెత్తే పరిస్థితి లేకపోవడంతో.. రాష్ట్రంలో కరువు పరిస్థితులు దూరమైపోయినట్టే.
చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే.. వర్షాలు రాష్ట్రం వైపు తొంగి కూడా చూడవనే అనే అపవాదు నుంచి ఆయన్ను ఈ భారీ వర్షాలు గట్టెక్కించాయి. తాజా వర్షాలకు రాష్ట్రమంతా జలకళ సంతకరించుకుంది. గతేడాదితో పోల్చి చూసుకుంటే.. ప్రస్తుతం 140టీఎంసీల నీరు మునుపటి కన్నా ఎక్కువగా ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరింది. దీంతో ఇక చంద్రబాబును కరువుతో ముడిపెట్టి కామెంట్ చేయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది.
ముఖ్యంగా ఈ భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో సాగునీటి సమస్యకు తావు లేకుండా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూగర్బ జలాలు సైతం పైకి రావడంతో రబీతో పాటు, ఖరీఫ్ పంట కాలానికి ఎలాంటి ఢోకా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షాలకు.. ఇప్పటిదాకా 488.30 టీఎంసీల నీరు ప్రాజెక్టులకు వచ్చి చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రిజర్వాయర్ల సామర్థ్యం 815.83టీఎంసీలు కాగా, గతేడాది ఈ సమయానికి 346.61 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. అంటే.. గతంతో పోల్చితే ఈ ఏడాది ఇప్పటికే 140 టీఎంసీల నీరు అధికంగా వచ్చి చేరినట్లు స్పష్టమవుతోంది. అల్ప పీడన ప్రభావంతో మరిన్ని వర్షాలు గనుక కురిస్తే.. ఇప్పటికే వచ్చి చేరిన 488.30 టీఎంసీలకు తోడు మరింత అధికంగా రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరనుంది.