పేలిన ఆక్సిజన్ సిలిండర్లు: ప్రభుత్వాస్పత్రి దగ్ధం, రోగుల పరుగు
కడప: జిల్లాలోని ఓబులవారిపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు కథనం ప్రకారం... ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో ఉన్న రెండు ఆక్సిజన్ సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన స్థానికులు రైల్వే కోడూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, రోగులు బయటికి పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా, అప్పటికే ఆస్పత్రిలోని ఫర్నిచర్, మందులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందూరు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎమ్అండ్హెచ్ఓ వెంకటసుబ్బయ్య ఆస్పత్రిని పరిశీలించారు.
అలిపిరి వద్ద టెంపో దగ్ధం
చిత్తూరు: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన భక్తులు బయలుదేరిన టెంపో ట్రావెలర్ తిరుమలకు వెళ్ళే రెండో కనుమ మార్గంలో జిఎన్సి టోల్గేట్కు సమీపంలో ఉన్న దివ్యారామం వద్ద మంటలబారిన పడి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఆవాహనంలో ప్రయాణిస్తున్న రెండు కుంటుంబాలకు చెందిన 12మంది పెద్దలు, 5మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.
అయితే వాహనం మంటలబారిన పడటంతో ఆ మంటలను చూసిన ముత్తులక్ష్మి(48)అనే ప్రయాణికురాలు షాక్కు గురై ఉన్నపళంగా కూలిపోయి అపస్మారక స్థితికి చేరుకుంది. సుదూరంగా ప్రయాణం చేయడం, రేడియేటర్లో నీళ్లు ఇంకిపోయినా డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రమాదానికి కారణమని తేలింది. కాగా, ప్రాణాలు దక్కించుకున్న షణ్ముగం, జయప్రకాష్ కుటుంబాలకు చెందిన బట్టలు,నగలు మంటలకు ఆహుతైపోయాయి.