ఏపీపీఎస్సీ నూతన చైర్మన్గా ఐటి నిపుణుడు ప్రొఫెసర్ ఉదయ భాస్కర్
హైదరాబాద్/కాకినాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నూతన చైర్మన్గా ప్రొఫెసర్ పి ఉదయ భాస్కర్ను ప్రభుత్వం బుధవారం నియమించింది. ఇందుకు సంబంధించి రెండు నెలలుగా ఉదయ భాస్కర్ పేరు వినిపిస్తున్నా అనేక కారణాల వల్ల ఆయన నియామకంలో జాప్యం జరిగింది. ఉదయ భాస్కర్ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.
అంతేగాక, ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ ఐఐటి నిపుణుడు. కాన్పూర్ ఐఐటిలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, అనంతరం పిహెచ్డి చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గత 24 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అనేక పరిశోధన ప్రాజెక్టులకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 20కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించిన ఉదయ భాస్కర్ అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు.
ఇటీవలే డైరెక్టర్ ఆఫ్ ఇవాల్యూయేషన్గా కూడా నియమితులయ్యారు. ఎపిపిఎస్సి చైర్మన్ పదవీకాలం ఏడాదిన్నర క్రితమే పూర్తయినా కొత్త చైర్మన్ నియామకం ఇప్పటివరకూ జరగలేదు. ఇంత కాలం ఎపిపిఎస్సికి ఇంఛార్జీ చైర్మన్గా వ్యవహరించిన ఎ శివన్నారాయణ పదవీ కాలం సైతం జూన్ 30తో ముగియడంతో అప్పటి నుంచి కమిషన్ చైర్మన్ లేకుండానే నడుస్తోంది. దీనికి తోడు కమిషన్ కార్యదర్శిగా కూడా ఎవర్నీ నియమించకపోవడంతో ఇంఛార్జీ కార్యదర్శిగా డి రమాదేవి కొనసాగుతున్నారు.
కమిషన్లో ప్రస్తుతం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. అందులో గుబ్బా చంద్రశేఖర్ 2009లో నియమితుడు కాగా, ఆయన డిసెంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఇక మరో సభ్యుడు జిఎస్ సీతారామరాజు 2012లో నియమితులు కాగా, ఆయన 2018 సెప్టెంబర్ 20న పదవీ విరమణ చేస్తారు.
ఇక మూడో సభ్యుడు సీనియర్ ఐఎఎస్ అధికారి మహ్మద్ రఫత్ అలీ 2013 నవంబర్ 25న నియమితుడు కాగా, ఆయన 2016 మార్చి 23న రిటైరవుతారు. ఒక దశలో గుబ్బా చంద్రశేఖర్ను ఇంఛార్జీ చైర్మన్గా నియమించాలనే ఒత్తిడి వచ్చినా, ముఖ్యమంత్రి పెద్దగా ఆసక్తి చూకపోవడంతో మిగిలిన సభ్యులు సైతం మౌనం దాల్చారు.
ఒక పక్క ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, మరో పక్క పూర్తి స్థాయి సభ్యులు లేక కమిషన్ ఇంతకాలం బోసిపోయింది. కొత్త చైర్మన్ నియమాకంతో మళ్లీ కమిషన్ పటిష్టం కాబోతోంది. ఒక సభ్యుడు డిసెంబర్లో రిటైరైతే ఇక కమిషన్లో మిగిలేది ఇద్దరు సభ్యులు మాత్రమే. దాంతో మరో ఆరుగురిని సభ్యులుగా నియమించేందుకు ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఎపిపిఎస్సి సభ్యులుగా నియామకానికి ఇప్పటికే గట్టిపోటీ ఉంది.
సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో పాటు కొంత మంది యూనివర్శిటీ ప్రొఫెసర్లు కూడా తమ బయోడేటాలను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు. ఈ బయోడేటాల స్క్రూటీని జరుగుతోందని సాధారణ పరిపాలనా శాఖ అధికారి ఒకరు చెప్పారు.
అభ్యర్ధులపై స్పష్టత రాగానే ఎపిపిఎస్సికి పూర్తిస్థాయి సభ్యుల నియామకం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, కమిషన్ ఏర్పాటు పూర్తయితే ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు భావిస్తున్నారు.