ప్యాకేజీయే బెటర్, మోడీ క్లోజ్ కాబట్టి పవన్ ఆయనతోనే పోరాడాలి: శివాజీ
రాజమహేంద్రవరం: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇక్కట్లు తొలగాలంటే కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడమే మంచిదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ బుధవారం నాడు అన్నారు.
ప్రస్తుత ఏపీ ఇబ్బందుల దృష్ట్యా ప్యాకేజీ తీసుకోవడమే మంచిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావించారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అదేనని చెప్పారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ ఇప్పుడు గట్టెక్కాలన్నారు.
ప్యాకేజీని తీసుకొని ఊరుకోమని చెప్పారు. ప్యాకేజీని తీసుకుని, రావాల్సిన పరిశ్రమల రాయితీ, రైల్వే జోన్, చెన్నై కారిడార్, యూనివర్సిటీల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా మంచిదే అన్నారు. హోదా కోసం పోరాడి సాధిస్తే మంచిదేనన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలతో పవన్కు మంచి సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. హోదా కోసం వారితోనే పోరాడాలని హితవు పలికారు. ప్యాకేజీ వల్ల పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించుకోవచ్చున్నారు. హోదా కోసం కలిసి కలిసి వచ్చే వారితో కలిసి పోరాడుతామన్నారు.