వరిసాగు నేల చూపులు: పట్టిసీమ గురించి చంద్రబాబుది వట్టిమాటేనా?
ఒకనాడు యావత్ భారతావనికి అన్నపూర్ణ వంటిది ఆంధ్రప్రదేశ్ అని పేరు. అటువంటిది తమకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో కోస్తాంధ్ర రైతులు 2012లో ‘క్రాఫ్ హాలీడే’ ప్రకటించారు.
అమరావతి: ఒకనాడు యావత్ భారతావనికి అన్నపూర్ణ వంటిది ఆంధ్రప్రదేశ్ అని పేరు. అటువంటిది తమకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో కోస్తాంధ్ర రైతులు 2012లో 'క్రాఫ్ హాలీడే' ప్రకటించారు. తాజాగా గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఆహార పంట ఏయేటికాయేడు క్షీణిస్తోంది.
నవ్యాంధ్రలో చంద్రబాబు నాయుడు అధికారంలోకొచ్చాక గత మూడేళ్లలో వరిసాగు నేల చూపులు చూస్తోంది. మూడేళ్ల అనుభవాలతో ఈ ఏడాది ఖరీఫ్లో వరిసాగు లక్ష్యాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఒక పక్క వాణిజ్యపంట పత్తిని తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం.. దాని సాగు విస్తీర్ణం పెంచిన ప్రభుత్వం అత్యధిక ప్రజలు ఆహారంగా ఉపయోగించే వరి సాగు లక్ష్యాలను కుదించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2015 నుంచి ఆగమేఘాల మీద గోదావరి నది నీటిని మళ్లించేందుకు పట్టెసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో కృష్ణాడెల్టా సస్యశ్యామలం అయిందని, హంద్రీనీవాతో రాయలసీమ పులకరించిందని కబుర్లు చెప్పింది.
అందులో నిజం లేదా....
తోటపల్లితో ఉత్తరాంధ్రకు జవసత్వాలు వచ్చాయని సర్కార్ ఎత్తుకున్న ప్రచారంలో నిజం లేదని మూడేళ్లలో వరి సాగు తగ్గిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అసలు సంగతేమిటంటే హంద్రీ నీవా, తోటపల్లి రిజర్వాయర్ల నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవ తీసుకోవడం వల్లే పనులు పూర్తయ్యాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013-14లో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలతో అసలు ప్రభుత్వ పాలనే సాగలేదు. చివరిలో రాష్ట్రపతి పాలన వచ్చింది. అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ 13 జిల్లాల ఏపీలో ఖరీఫ్, రబీ కలుపుకొని 25.23 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన గత మూడేళ్లలో ఆ స్థాయిలో వరి పండలేదు. సాగు విస్తీర్ణం గ్రాఫ్ కిందకు దిగుతోంది. ఖరీఫ్ కంటే రబీ సేద్యం బాగా తగ్గుతోంది.
తొలి ఏడాది విభజన సాకుగా చూపిన బాబు సర్కార్
2014 జూన్ 8వ తేదీన కొలువు దీరిన చంద్రబాబు సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఏడాది రెండు సీజన్లూ కలుపుకొని 23.94 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. తమది కొత్త ప్రభుత్వమని, పేరు మారక పోయినా నూతన రాష్ట్రమేనని, అన్నీ సర్దుకొనేసనరికి ఖరీఫ్ గడచిపోయిందని చంద్రబాబు సర్కార్ తప్పించుకున్నది. రెండో ఏడాది 2015-16లో 21.61 లక్షల హెక్టార్లకు వరి సాగు తగ్గిపోయింది. ముచ్చటగా మూడోయేట 2016-17లో 20.37 లక్షల హెక్టార్లకు వరి సాగు క్షీణించింది. కృష్ణాడెల్టాకు పట్టెసీమ నీరు తోడిపోసి ఖరీఫ్ పంటలు కాపాడామని చంద్రబాబు ప్రభుత్వం.. ఆయనను వెన్నంటి కాపాడే మీడియా చెప్పుకున్నా ఆయకట్టు చివరి భూముల్లో వరి సాగు కాలేదు. కొన్ని చోట్ల పంట ఎండిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో వరికి బదులు చాలాచోట్ల మినుములు, కందులు, పెసలు తదితర పంటలు సాగు చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి నీరు ఇవ్వక వరి సేద్యం లేదు. కెసి కెనాల్ ఆయకట్టుకు చుక్కనీరు లేక అక్కడా వరి పంట వేయలేదు. హంద్రీ - నీవా అన్నా అతీగతీ లేదు. ఖరీఫ్లోనే నీటికి కటకట ఏర్పడటంతో రబీలో కృష్ణాడెల్టా, నాగార్జునసాగర్. కెసి కెనాల్ ఆయకట్టులో వరి సాగు చేయనేలేదు. నెల్లూరులో నిరుడు దుర్భర కరువు ఏర్పడటం, సోమశిల ప్రాజెక్టుకు పెద్దగా నీరు చేరకపోవడంతో పెన్నార్ డెల్టాలోనూ వరి సాగు తగ్గింది. ఈ పరిణామాలతో నిరుడు వరిసాగుకు కోత పడింది.
మానవతా దృక్పథంతో తెలంగాణ ఇలా
గమ్మత్తేమిటంటే మూడేళ్లుగా క్రుష్ణా డెల్టా పరిధిలో వరి సాగు కోసం ప్రకాశం బ్యారేజీకి నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉన్నది. తొలి ఏడాది సాగర్ రిజర్వాయర్ సాక్షిగా ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. అప్పటివరకు అన్నదమ్ముల్లా కలిసి పనిచేసిన పోలీసుశాఖ ఉన్నతాధికారులు బద్ధ శత్రువుల్లా మారిపోయారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే ఇరు రాష్ట్రాల సీఎంలతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమావేశమై సర్దుమణిగేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని పేచీలు పెట్టినా కోస్తా డెల్టాలో పంటల సాగుకు అవసరమైన నీటిని విడుదల చేసేందుకు ఏనాడూ తెలంగాణ ప్రభుత్వం వెనుకాడలేదు. ఏపీ సర్కార్ తీరును బయటపెట్టినా రైతన్నను ఆదుకునేందుకు చివరి క్షణాల్లో కూడా నీరు విడుదల చేసిన దాఖలాలు బయటపడ్డాయి. క్రుష్ణా జలాల వినియోగంపై ఏపీ మాత్రం అనునిత్యం తప్పుడు గణాంకాలు చూపుతూనే తెలంగాణను మోసగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నది. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. రైతన్న ఆదుకునేందుకు తెలంగాణ ముందుకు వస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి సాగు నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్లు మారడానికి కారణాలేమిటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
సాగు లక్ష్యాలు తగ్గుముఖమే
వరుసగా వరి సాగు తగ్గుతుండటంతో 2017లో సగటు సాగు లక్ష్యాలూ తగ్గాయి. ఖరీఫ్ వరి సాగు లక్ష్యాలను వ్యవసాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వం రెండూ నిరుటి మీద దిగ్గోశాయి. 2016 ఖరీఫ్లో సర్కారు లక్ష్యం 17.50 లక్షల హెక్టార్లు కాగా వ్యవసాయశాఖ లక్ష్యం 16.03 లక్షల హెక్టార్లు. 2017 ఖరీఫ్కొచ్చేసరికి ప్రభుత్వ టార్గెట్ 16.25 లక్షల హెక్టార్లు కాగా వ్యవసాయశాఖ లక్ష్యం 15.63 లక్షల హెక్టార్లు. 2017-18 రబీ లక్ష్యాన్ని సైతం 8 లక్షల హెక్టార్ల నుంచి 7.50 లక్షల హెక్టార్లకు కుదించాయి. నిరుడు తొలుత 8 లక్షల హెక్టార్లని అంతలోనే ఏడు లక్షల హెక్టార్లకు తగ్గించారు. వచ్చే రబీలోనూ ఇలానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.