జగన్ మాట్లాడావా! రికార్డులు తీసుకురా!: పల్లె సవాల్
హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా అని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం గురించి, ఆయన ప్రాతినిధ్యం వహించిన కడప గురించి, చివరికి సొంత ఊరు పులివెందుల అభివృద్ధి గురించి పార్లమెంటులో మాట్లాడారా? మాట్లాడిన రికార్డులు ఉంటే తీసుకురావాలని మంత్రి సవాల్ చేశారు.
ఐదేళ్లు ఎంపీగా ఉండి రాష్ర్టానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ర్టానికి ప్రత్యేకహోదా, ప్రయోజనాల కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే కేంద్రంతో తెగతెంపులు చేసుకుని, ఎలాంటి ప్రయోజనాలూ సాధించకూడదని జగన్ కోరుకుంటున్నారని అన్నారు.
అసెంబ్లీ సొంత పార్టీ కార్యాలయం అన్నట్లుగా జగన్ ప్రవరిస్తున్నారని ఆరోపించారు. జగన్ను మించిన వెన్నుపోటుదారుడు దేశంలో ఎక్కడా ఉండరని అంటూ వైఎ్సఆర్కు, జగన్కు కాంగ్రెస్ పార్టీ రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తే చివరికి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీని వీడారన్నారు. 29 మందిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంపారని పదే పదే అనడం సంస్కారం కాదని, హత్యలు, దాడులు చేయడం వైఎస్ కుటుంబానికి పేటెంట్ హక్కులాంటిదని, అలాంటి సంస్కృతి ఇతరులకు ఉండదని మంత్రి వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్న జగన్కు అసలు అది ఏమిటో తెలుసా? అని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబు ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ అంటే చర్లపల్లి జైలులో ఖైదీలకు ఇచ్చేది అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కలిసి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడానికి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడినప్పుడు జగన్ ఎందుకు నోరువిప్పలేదని రావెల ప్రశ్నించారు.