ఇమేజ్ తగ్గించలేరు: పల్లె, బెజవాడ వైపు ఐటీ... !
విశాఖపట్నం: విశాఖ ఇమేజ్ను తగ్గించడం ఎవరివల్ల కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం అన్నారు. హుధుద్ తుఫాను సమయంలో అధికారులు, మంత్రులు అంతా కలిసి పని చేయడం ఓ రికార్డ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ఇలా జరగలేదన్నారు. దీనికి అంతటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తే కారణమన్నారు.
అధికారులు, మంత్రులు అంతా కలిసి చాలా తక్కువ సమయంలో తుఫాను ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల ద్వారా పరిస్థితిని మామూలు స్థితికి తీసుకు వచ్చారన్నారు. ఉత్తరాంధ్రలో దాదాపు 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, మిగిలిన 20 శాతం త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. వ్యవసాయ కనెక్షన్లను కూడా త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. తుఫాను నేపథ్యంలో ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తామన్నారు.
విశాఖను ఐటీ, పారిశ్రామిక, విద్యా కేంద్రంగా మారుస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. హుధుద్ తుఫాను సమయంలో బాగా పని చేసిన వారికి సన్మానం చేస్తామని మరో మంత్రి నారాయణ అన్నారు.
బెజవాడ వైపు ఐటీ కంపెనీల చూపు
కాగా, విజయవాడ వైపు ఐటీ కంపెనీలు చూస్తున్నాయని అంటున్నారు. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలను నెలకొల్పుదామని అనుకునేవారు, ఇప్పటికే అక్కడ ఉన్న కొన్ని కంపెనీలు విజయవాడకు తరలి రావాలని అనుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుధుద్ తుపాను బీభత్సం తరువాత విశాఖలో నెలకొల్పేందుకు ఐటీ పారిశ్రామికవేత్తలు ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
విజయవాడను రాజధానిగా ప్రకటించడం, సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి విమానాల రాక పోకలు పెరిగాయి. అలాగే రాత్రి వేళ్ళల్లో విమానాల రాకపోకలు అనుకూల పరిస్థితులను అధికారులు కల్పించారు. రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడంతో పాటు ఇటీవల సాంకేతిక నిపుణుత ఈ ప్రాంతంలో బాగా దొరికే అవకాశం ఉండడంతో ఐటీ కంపెనీలు విజయవాడ వైపు దృష్టి సారించారని అంటున్నారు.
గతంలో ఈ సౌకర్యాలు లేకపోవడం, ఇక్కడ భూముల ధరలు అత్యధికంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు హైదరాబాద్, విశాఖల వైపు తరలి వెళ్లారంటున్నారు. హుధుద్ ప్రభావం కూడా పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 25 ఐటీ కంపెనీలు ఇక్కడ ఎంక్వయిరీ ప్రారంభించాయట. వీటిలో కొన్ని గన్నవరం వద్ద మేధాకు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నది.