ఓ బచ్చా, సీమ ద్రోహి: జగన్పై పల్లె విసుర్లు, ఏపీకి వేణుగోపాల్ షాక్!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి సీనియర్ నేత, ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం జరిగిన మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో జగన్ను చోటా బచ్చాగా అభివర్ణించిన ఆయన.. అవినీతిలో మాత్రం జగన్ సామ్రాట్ స్థాయికి ఎదిగారని ఎద్దేవా చేశారు.
దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడైన జగన్ 11 కేసుల్లో నిందితుడిగా ఉంటూ శ్రీరంగ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పట్టిసీమను నిర్మిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండదన్న ఉద్దేశంతోనే దానిని అడ్డుకుంటూ రాయలసీమ ద్రోహిగా మారారని జగన్పై మంత్రి పల్లె ధ్వజమెత్తారు.
ఏపీ సర్కారుకు షాక్: అడ్వొకేట్ జనరల్ పదవికి వేణుగోపాల్ రాజీనామా!
రాష్ట్ర పునర్విభజనతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందడం లేదని ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్లోని సంస్థల విభజనకు అటు కేంద్రంతో పాటు ఇటు పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా సహకరించడం లేదని, ఈ సంస్థల విభజన అంశం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది ఏపీ ప్రభుత్వం.
కాగా, ఇటీవలే కోర్టు ఏపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలైతే... పదో షెడ్యూల్లోని సంస్థల విభజన పూర్తి కావడంతో పాటు సదరు సంస్థల్లోని నిధుల లభ్యతతో ఏపీకి కాస్తంత ఊరట లభించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఈ దిశగా చర్యలను ఏపీ సర్కారు వేగవంతం చేసింది. ఇందులో అడ్వొకేట్ జనరల్ పాత్రే కీలకం.
రాష్ట్ర విభజన తర్వాత పరాంకుశం వేణుగోపాల్ను సీఎం చంద్రబాబునాయుడు అడ్వొకేట్ జనరల్గా నియమించారు. ప్రభుత్వం తరఫున పలు కీలక కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించిన వేణుగోపాల్ ఆదివారం చంద్రబాబు సర్కారుకు షాకిచ్చారు. ఉన్నపళంగా అడ్వొకేట్ జనరల్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అంతేగాకుండా ఆయన తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఆ మరుక్షణమే హైకోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయాన్ని ఆయన ఖాళీ చేసేశారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలోనే వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వొకేట్ జనరల్ పదవిని ఖాళీగా ఉంచడం ఏపీ సర్కారుకు ఇబ్బందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తక్షణమే కొత్త అడ్వొకేట్ జనరల్ను నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.