విధ్యార్థినితో లెక్చరర్ పరారీ, హల్ టిక్కెట్టు ఇప్పిస్తానంటూ ఇలా....
జూనియర్ కాలేజీ విధ్యార్థినితో లెక్చరర్ పారిపోయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు:ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ ప్రబుద్దుడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు విధ్యార్థిని కిడ్నాప్ చేశాడు. తమ కూతురు ఆచూకీని తెలపాలంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు జిల్లా వినుకొండ మండల పరిధిలోని సీతయ్య కాలనీకి చెందిన తమ కూతురును లెక్చరర్ శ్రీకాంత్ కిడ్నాప్ చేశాడని తల్లిదండ్రులు గుంటూరు రూరల్ ఎస్ పికి ఫిర్యాదు చేశారు.
ఈ నెల 5వ, తేదిన లెక్చరర్ శ్రీకాంత్ తమ ఇంటికి వచ్చి తమ కూతురును బైక్ పై తీసుకెళ్ళాడని తల్లిదండ్రులు చెప్పారు. హల్ టిక్కెట్టు ఇస్తున్నారని చెప్పి మరీ తీసుకెళ్ళారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించకపోవడంతో ఎస్ పి ని ఆశ్రయించారు.
ఆ రోజు నుండి శ్రీకాంత్ , తమ కూతురు ఆచూకీ లేకుండా పోయారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. శ్రీకాంత్ కు గతంలోనే వివాహమైంది. అయితే భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడని వారు చెప్పారు. తమకు న్యాయం చేయాలని గుంటూరు రూరల్ ఎస్ పి కోరారు తల్లిదండ్రులు.