పరిటాలని వైఎస్సే చంపారని ఊరూరా తిరిగావ్: రోజాను ఇరుకున పెట్టిన సునీత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పైన మంత్రి పరిటాల సునీత బుధవారం నాడు శాసన సభలో విరుచుకుపడ్డారు. రోజా నాడు టిడిపిలో ఉన్న సమయంలో పరిటాల రవి ఫోటోలకు గ్రామగ్రామానికి తిరిగి దండలు వేశారని గుర్తు చేశారు.
నాడు పరిటాల రవి ఫోటోలకు దండలు వేసి, ఆయనను హత్య చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి అని ఊరూరూ తిరిగిందని చెప్పారు. ఇప్పుడు నేను, తన కొడుకు హత్యారాజకీయాలు చేస్తున్నామని ఆరోపించడం విడ్డూరమన్నారు. మేం హత్యా రాజకీయాలు చేసినట్లు రోజా నిరూపించగలరా అని ప్రశ్నించారు.
ఉల్లిగడ్డ ధర పెరుగుపై మాట్లాడుతూ... ఉల్లి గడ్డ ధర తగ్గే వరకు తాము రూ.20కి కిలో ఇస్తామని చెప్పారు. 10,600 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డను తాము కొనుగోలు చేసి, సరఫరా చేశామని చెప్పారు. కర్నూలు ఉల్లిని కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామన్నారు.
పట్టిసీమపై జగన్ దుష్ప్రచారం: దేవినేని
పట్టిసీమ ప్రాజెక్టు పైన వైయస్ జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. పట్టిసీమకు మార్చి 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపనం చేశారన్నారు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. గోదావరి నదిలో వరద నీరు తగ్గేలోపు కృష్ణా నదికి తీసుకు రావాలనేది లక్ష్యమని చెప్పారు. ఇప్పటి వరకు 900కు పైగా టీఎంసీల నీరు వృథా అయిందని చెప్పారు.
పులిచింతలను ఎందుకు విస్మరించారు: జ్యోతుల నెహ్రూ
గోదావరి, కృష్ణా నదిని అనుసంధానం చేయవలసిన అవసరం ఉందని, దానిని తాము వ్యతిరేకించడం లేదని వైసిపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కృష్ణాను కర్నాటకకు, గోదావరిని మహారాష్ట్రకు అనుసంధానం చేశామని ఎద్దేవా చేశారు.
ఏ ప్రభుత్వం హయాంలో నారాయణ పూర్, అళ్మట్టి డ్యాంల నిర్మాణం జరిగిందని ప్రశ్నించారు. పట్టిసీమ గురించి ఒకటికి పదిసార్లు చర్చించుకుంటున్నామని, పులిచింతల ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆ ప్రాజెక్టును ఎందుకు విస్మరించారన్నారు.