జగన్ శవయాత్ర చేసినా..: పరిటాల సునీత, బాబుపై ధర్మాన
కర్నూలు/ హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తీవ్రంగా మండిపడ్డారు. జగన్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సునయన ఆడిటోరియంలో జిల్లా రేషన్ డీలర్ల సమావేశంలో మంత్రి సునీత పాల్నొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
జగన్ బస్సు యాత్ర చేపట్టినా శవ యాత్ర చేపట్టినా పట్టిసీమ ప్రాజెక్టు ఆగదని ఉద్ఘాటించారు. ప్రాజెక్టు పనులను ఏడాదిలో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ-పాస్ విధానంలో ఉన్న లోపాలను మే నెలలోపు సవరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. సత్యవేడు సెజ్ లో ప్రభుత్వం హీరో కంపెనీకి కేటాయించిన భూమలు వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఎలాంటి పారిశ్రామిక ప్రగతి సాధించలేదని మాజీ మంత్రి ధర్మాన గుర్తు చేశారు.