నేను నోరు తెరిస్తే జగన్ 16 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుంది: పరిటాల సునీత
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పరిటాల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను నోరు విప్పితే జగన్ 16 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆమె అన్నారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడితే వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని ఆమె జగన్పై విరుచుకుపడ్డారు. జగన్ 16 నెలలు కాదు.. 16 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై మాట్లాడితే బాగుండేదని మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తే ఆమె జగన్పై విరుచుకుపడ్డారు.
పత్తిపాటి పుల్లారావు భూములు అవి కావు
అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని కుటుంబరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారని చినరాజప్ప తెలిపారు. కొన్ని ఆస్తులను కూడా సీజ్ చేశామని, పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని ఆయన అన్నారు. అందరికీ న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని చినరాజప్ప చెప్పారు. రూ.3,890 కోట్ల వరకు బాధితులు నష్టపోయారని ఆయన చెప్పారు.
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకే ముందుకెళ్తున్నామని చినరాజప్ప స్పష్టం చేశారు. విపక్ష నేతలు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని చినరాజప్ప విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించి వేలం వేసే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు. బయట భూములతో తమకు సంబంధం లేదని చినరాజప్ప చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ కింద 16 వేల ఎకరాల భూములు ఉన్నాయని అన్నారు. పుల్లారావు కొన్న భూమి అగ్రిగోల్డ్కు సంబంధించినది కాదని చినరాజప్ప తెలిపారు.
హైకోర్టు పర్యవేక్షణలోనే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరుగుతోందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తులను గుర్తించి సీజ్ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని డీజీపీ అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు లాగా ఏ కేసులోనూ ఇంత వేగం లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు.
పిచ్చి పుల్లయ్యలా ఉంది...
మంత్రి పుల్లారావు తీరు పిచ్చి పుల్లయ్యలా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గౌతంరెడ్డి విమర్శించారు. అగ్రిగోల్డ్ స్కాంను పక్కదారిపట్టించేందుకు అవాస్తవాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. తాను అగ్రిగోల్డ్ లీగల్ అడ్వైజర్నని దుష్ప్రచారం చేస్తున్నారని గౌతంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, అగ్రి భూములకు సంబంధం లేదని సీఐడీ నివేదిక ఇచ్చిందని గౌతంరెడ్డి గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో నేను ఒకడినని ఆయన చెప్పారు. మంత్రి ప్రత్తిపాటిపై పరువు నష్టం దావా వేస్తానని గౌతంరెడ్డి హెచ్చరించారు.