జగన్కు ప్రశ్నించే హక్కు: సునీత, పక్క రాష్ట్రంతో కలిస్తే ఖబడ్తార్: రావెల
గుంటూరు: ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీసే హక్కు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉందని ఏపీ మంత్రి పరిటాల సునీత సోమవారం అన్నారు. గుంటూరులోని మంగళగిరిలో మహా సంకల్ప దీక్షకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఛానల్తో మాట్లాడారు.
చంద్రబాబు పైన వ్యూహాత్మక కుట్ర జరుగుతోందని చెప్పారు. ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని విజయాలను చంద్రబాబు ఒక్క ఏడాదిలో సాధించారని చెప్పారు. జగన్ మంగళగిరిలో ధర్నా చేయడం విడ్డూరమన్నారు. పులివెందులలో ధర్నా చేయాలని, ఎవరికైనా రుణమాఫీ కాలేదని అంటే తమను నిలదీయవచ్చునన్నారు.
పల్లెల్లోకి వెళ్లి ప్రభుత్వం రుణమాఫీ మాఫీ చేసిందా లేదా అడగాలని సలహా ఇచ్చారు. ఎవరికైనా రుణమాఫీ కాలేదంటే తమను జగన్ నిలదీయవచ్చునని చెప్పారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కై చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారన్నారు.
తాము కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తమను ఎదుర్కొనే ధైర్యం వారికి లేదన్నారు. చంద్రబాబు ఏ రోజు తప్పు చేయలేదన్నారు. తెలంగాణలో విడుదలైన ఆడియో టేప్లలో ఉన్నది చంద్రబాబు గొంతు కాదన్నారు. కేసీఆర్, మంత్రులు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదన్నారు.
పొరుగు రాష్ట్రాలతో చేయి కలుపుతున్న ప్రతిపక్షం
ప్రజా సంక్షేమాలను అడ్డుకోవడానికి ప్రతిపక్షం పొరుగురాష్ట్రంతో చేతులు కలుపుతోందని మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. చంద్రబాబు ఓ మహా నగరాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. బాబుపై అచంచల విశ్వాసంతో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
ఇంతకాలం ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, మొత్తం దోచుకున్నారని, ఇక వారి ఆటలు సాగవన్నారు. బాబు చేసే అభివృద్ధికి సహకరించకుంటే ప్రతిపక్షాలను ప్రజలు తరిమి కొడతారన్నారు. చేతనయితే అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పొరుగు రాష్ట్రంతో చేతులు కలిపి స్వచ్ఛమైన సీఎం, త్యాగాలకు మారుపేరు అయిన చంద్రబాబు పైన కుట్రలు చేస్తున్నారన్నారు. బాబును అప్రతిష్టపాలు చేయాలనుకుంటే ఖబడ్తార్ అని హెచ్చరించారు. ఏపీని, చంద్రబాబును దేశవిదేశాల్లోని తెలుగు వారు ఆశీర్వదించాలన్నారు.
మహా సంకల్ప దీక్ష ప్రారంభం
మంగళగిరిలో మహా సంకల్ప దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షలో గవర్నర్ నరసింహన్ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రాసిన మహా సంకల్పం పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. చంద్రబాబు తన ఏడాది పాలన పైన ప్రసంగిస్తారు. తన ఏడాది పాలన పైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
పార్కింగ్ సమస్య
మంగళగిరి మహా సంకల్ప దీక్షకు పార్కింగ్ సమస్య ఇక్కట్లు ఎదురయ్యాయి. పోలీసులు ఆరు కిలోమీటర్ల దూరంలో పార్కింగ్కు ఏర్పాటు చేశారు. వాహనాదురులు అంతదూరం నడవలేక చాలామంది వెనక్కి పోయారు. కాగా, చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్లు విజయవాడ నుండి మహా సంకల్ప దీక్షకు బయలుదేరారు. ప్రజలతో మహా సంకల్ప దీక్ష ప్రమాణం చేయిస్తారు.