ఆ మంత్రి! ఏపికి పట్టిన దరిద్రం: పార్థసారథి, బాబు వల్లే ఆత్యహత్యలన్న మేకపాటి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువారి హక్కులను ఢిల్లీకి తాకట్టుపెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.
ఆయన గురువారం మాట్లాడుతూ.. ఏపీకి పట్టిన దరిద్రం మంత్రి దేవినేని ఉమా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని అన్నారు.
మంత్రి దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని మరో నేత జోగి రమేశ్ సూచించారు. మంత్రి పదవిలో ఉండి సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు.
బాబు మోసపూరిత వాగ్ధానాల వల్లే ఆత్మహత్యలు: మేకపాటి
ప్రత్యేక హోదాపై ఏపి సిఎం చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన కోరారు. అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడదామన్నారు.
నెల్లూరు వేదాయపాళెంకు చెందిన రామిశెట్టి లక్ష్మయ్య(55) అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోసం గురువారం తెల్లవారు జామున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం తాను చనిపోతున్నట్లు లక్ష్మయ్య సూసైడ్ నోట్లో కూడా పేర్కొన్నాడు.
జగన్వి అర్థంపర్థం లేని విమర్శలు: మంత్రి రావెల
ఉనికిని కోల్పోతామనే భయంతోనే రాజధాని రైతులను వైయస్ జగన్ రెచ్చగొడుతున్నారని ఏపి మంత్రి రావెల కిషోర్బాబు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలుంటే చెప్పాలని, అంతేకానీ, అర్థంపర్థం లేని విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. జగన్ ధర్నాలు, దీక్షలు రాజకీయ ఉనికి కోసమేనని విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వమని మంత్రి రావెల భరోసా ఇచ్చారు.