జగన్లా ఆలోచిస్తే జైళ్లు సరిపోవు: పత్తిపాటి, టీ సర్కార్పై యనమల నింద
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్లా అందరూ ఆలోచిస్తే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని ఆయన బుధవారం అన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్టీ రామారావు పేరు కనిపించకుండా చేసింది వైయస్ రాజశేఖర రెడ్డేనని, ఎన్టీఆర్ పేర అవార్డును కూడా వైయస్ తొలగించారని ఆయన అన్నారు. పథకాల పేర్లు మార్చే సంస్కృతి కాంగ్రెసు పార్టీదేనని ఆయన అన్నారు.
శాసనసభ లాంజ్లోంచి వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటోను తొలగించిన విషయాన్ని జనరల్ పర్పస్ కమిటీ చూసుకుంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత, అనుభవం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేవని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించారు. సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.