పవన్ కళ్యాణ్పై వారి వ్యాఖ్యల మతలబు: నిలదీసిన బొత్స
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు, జెసి దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల మతలబు ఏమిటనే విషయంపై చర్చ సాగుతోంది.
ప్రత్యేక హోదా కోసం ముందుండి ఉద్యమం చేస్తే పవన్ కళ్యాణ్ వెంట తాము నడుస్తామని జెసి దివాకర్ రెడ్డి. రాయపాటి సాంబశివరావు విడివిడిగానే గానీ కూడబలుక్కున్నట్లుగా అన్నారు. పవణ్ కళ్యాణ్ మాటలు చెబుతారు గానీ పోరాటం చేయబోరని వారు నర్మగర్భంగా అన్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
విశేషమైన రాజకీయానుభవం ఉన్న రాయపాటి సాంబశిరావు, జెసి దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్పై అసహనంతోనే అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తే తాను వెనక నడుస్తామని సినీ హీరో శివాజీ కూడా పలు సందర్భాల్లో అన్నారు.
ప్రశ్నించడం, నిలదీయడం మాత్రమే చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపైకి, కేంద్ర ప్రభుత్వంపై గురి పెట్టకుండా తమను విమర్శిస్తున్నారనే కోపం కూడా వారి వ్యాఖ్యల్లో ఉందని భావిస్తున్నారు.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ను శనివారం మీడియా సమావేశంలో సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షమో, అధికార పక్షమో తేల్చుకోవాలని ఆయన పవన్ కళ్యాణ్కు సూచించారు. మొత్తమ్మీద మరోసారి పవన్ కళ్యాణ్ ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు.