పవన్ కల్యాణ్ ఎఫెక్ట్: ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం చంద్రబాబు ప్రకటన
ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గొంత విప్పిన సంఘటన ఫలితాలు ఇస్తోంది. ఆ ప్రభావంతో చంద్రబాబు వారి కోసం ఓ ప్రకటన చేశారు.
అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీల వ్యాధులతో బాధపడుతున్నవారి కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గొంతు ఎత్తడం వల్ల ఫలితం కనిపిస్తోంది. సమస్య 48 గంటల్లో పరిష్కారమయ్యేది కాదని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కాస్తా కఠినంగా మాట్లాడినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం వారి కోసం ఓ ప్రకటన చేసారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీలు దెబ్బతిన్నవారికి వికలాంగుల పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఆయన ఆయాశాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్ధానం సమస్యను డాక్టర్ సిఎల్ వెంకట్రావు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు ఆ విషయం చెప్పారు.
ఉద్ధానం సమస్యను ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలు సవాల్గా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే ఈ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. యుద్ధప్రాతిపదికన ఉద్దానం సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని, శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాల్సి ఉందని, ఉద్దానంలాంటి సమస్యల పరిష్కారానికి సైన్స్ కాంగ్రెస్ లాంటి సదస్సులు వేదిక కావాలని చంద్రబాబు అన్నారు.
ఉద్ధానంలో పెద్ద యెత్తున ప్రజలు మూత్రపిండాల వ్యాధులకు గురి కావడంపై ఇటీవల పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వాల తీరును తప్పు పట్టారు. ఉద్ధానం కిడ్నీ బాధితులతో ఆయన మాట్లాడారు.