హోటల్లో తెలుగు హీరోల ఫ్యాన్స్ ఫైట్: పవన్ కళ్యాణ్ అభిమాని హత్య
చిత్తూరు: అభిమానం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆదివారం రాత్రి నరసాపుర వద్ద హోటల్లో ఇద్దరు తెలుగు హీరోల అభిమానులు ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనలో వినోద్ కుమార్ అనే ఇరవై నాలుగేళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు.
నటుడు సుమన్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారు. కార్యక్రమం తర్వాత హోటల్లో మద్యం సేవించే సమయంలో తమ అభిమాన నటుల గురించి వారి మధ్య చర్చకు వచ్చిందని తెలుస్తోంది.
ఒకరు గొప్ప అంటే - మరొకరు గొప్ప అంటూ వాగ్వాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఛాతీపై కత్తిపోట్లకు గురైన వినోద్ కుమార్ను ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి అక్షయ కుమార్, మరికొందరిని అరెస్టు చేశారు. వేమగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. వినోద్ అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు.
కాగా, వినోద్ కుమార్ పవన్ కళ్యాణ్ అభిమాని. అతను జనసేనకు సంబంధించి తిరుపతి నగరంలోనే కాకుండా చిత్తూరులో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. కోలార్లో జరిగిన కార్యక్రమానికి వెళ్లి, హత్యకు గురయ్యాడు. ఇదిలా ఉండగా పవన్ వీరాభిమాని అయిన వినోద్కు మరో యంగ్ హీరో అభిమాని అయిన వ్యక్తి గొడవ పడ్డాడని తెలుస్తోంది. అరెస్టైన వ్యక్తి జూ.ఎన్టీఆర్ అభిమాని అని తెలుస్తోంది.