చంద్రబాబు యాక్షన్కు రియాక్షన్: హీట్ పెంచిన పవన్ కల్యాణ్
ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు యాక్షన్కు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రియాక్షన్ చూపించారు. తాము సిద్ధమంటూ ప్రకటించి వేడి పుట్టించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికల ప్రకటనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీటుగా స్పందించారు. చంద్రబాబు యాక్షన్కు ఆయన నుంచి వెంటనే రియాక్షన్ వచ్చింది. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమంటూ సవాల్ చేశారు.
ముందస్తు ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2019లో జరగాల్సిన శానససభ ఎన్నికలకు 2018 నవంబర్లోనే వెళ్లాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురు అవుతుండడం కారణంగనే కాకుండా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నిర్మాణం కూడా జరగలేదు. దాంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తే వ్యూహాత్మకంగా విజయం సాధించవచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
జోరు పెంచిన పవన్ కల్యాణ్
తన పార్టీ నిర్మాణం విషయంలో ఇప్పటికే పవన్ కల్యాణ్ జోరు పెంచారు. ఓ జోరును మరింత వేగవంతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పవన్ అనంతపురం రిక్రూట్మెంట్ వ్యవహారంలో బిజీగా ఉన్నారు. ఈ స్థితిలో ముందస్తు ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటనే విషయంపై జనసేనలో అంతర్గత చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది.
సుదీర్ఘ చర్చ తర్వాతే పవన్...
చంద్రబాబు ప్రకటన వెలువడిన తర్వాత పవన్ కల్యాణ్ పార్టీ నాయకులతోనూ సన్నిహితులతోనూ సుదీర్ఘమైన చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ చర్చల తర్వాతనే తాము ఎన్నికలకు సిద్ధమంటూ ట్విట్టర్ ముఖంగా ప్రకటించినట్లు చెబుతున్నారు. తద్వారా ఓ రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాన్ని పవన్ కల్యాణమ్ ఆ ప్రకటన ద్వారా ప్రదర్శించారని అంటున్నారు. తాము భయం లేదనే సంకేతాలను ఇవ్వడం రాజకీయ పార్టీ లక్షణంగా ఆయన భావించినట్లు చెబుతున్నారు.
మిగతా జిల్లాల్లోనూ...
అనంతపురం జిల్లాలో రిక్రూట్మెంట్ ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాల్లో రిక్రూట్మెంట్ ప్రారంభించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ నియామకప్రక్రియ మొత్తం మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తారని, ఆ తర్వాత ఆరు నెలల పాటు పార్టీ రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.
జనవరికల్లా పార్టీ నిర్మాణం పూర్తి..
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2018 జనవరి కల్లా జనసేన పార్టీ నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లవచ్చునని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ప్రజా సమస్యలతో పాటు తమ పార్టీ విధానాలను కూడా ప్రజలకు వినిపించవచ్చునని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తద్వారా ఏడాది పాటు ప్రజల మధ్య తిరగడానికి వెసులుబాటు లభిస్తుందని అంటున్నారు.