పవన్ కల్యాణ్ మంచి మిత్రుడు, ఎవరు కోరినా...: పత్తిపాటి
గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రత్యేక హోదా ఎవరు కోరినా మంచిదేనని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పారు.
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నాలగవ భవననంలో శనివారంనాడు ఆయన తన శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే సమయోచితంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
వ్యవసాయ శాఖ ప్రారంభ కార్యక్రమంలో ఎంపి రాయపాటి సాంబశివరావు, మంత్రులు నారాయణ, దేవినేని ఉమా మహేశ్వర రావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, కలెక్టర్ క్రాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే, ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదనను అర్ధం చేసుకున్నామని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే కేంద్రానికి అనేక రూపాల్లో విజ్ఞప్తులు చేశామని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. టీడీపీ, జనసేన మిత్రపక్షాలేనని డొక్కా మాణిక్యవరప్రసాద్ వెల్లడించారు.