భారీ ప్లాన్: తిరుపతి బహిరంగ సభలో పవన్ ప్రస్తావించే విషయాలివే?
అమరావతి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ శనివారం నిర్వహించనున్న బహిరంగ సభ వెనుక భారీ ప్లాన్ ఉందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తిరుపతి ఇందిరా మైదానంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభపైనే అందరి దృష్టి ఉంది.
2014 ఎన్నికల ప్రచారం తర్వాత ఎక్కడా సభలు నిర్వహించని పవన్ కళ్యాణ్, ఇప్పుడు తిరుపతిలో సభ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే చర్చ మొదలైంది. అంతేకాదు పక్కా ప్లాన్తోనే రాబోయే ఎన్నికల్లో ముందుకు పోవడానికి సిద్ధమైన పవన్, ఇప్పట్నుంచే సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ బహిరంగ సభలో పవన్ ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా శనివారం పవన్ నిర్వహించనున్న ఈ సభపై అట అభిమానులతో పాటు రాజకీయ నేతల్లో కూడా ఆసక్తి నెలకొంది. బహిరంగ సభలో ఏం మాట్లాడాలనే విషయమై శుక్రవారమిక్కడ టీఎస్ఆర్ అతిథి గృహంలో సన్నిహితులతో చర్చిస్తున్నారు.
జనసేన పార్టీపై అభిమానులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో ప్రత్యేకహోదాపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా.. పవన్ ఎక్కడా నోరుమెదపలేదు. ఈ సభలో ప్రత్యేక హోదా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
టీడీపీ దోస్తీపై
అటు కేంద్రంతో.. ఇటు టీడీపీతో దోస్తీ కట్టి విస్తృతంగా ప్రచారం చేపట్టి ఏపీలో టీడీపీకి అధికారం తెచ్చిపెట్టిన పవన్ మున్ముందు ఎలా ముందడుగేయనున్నారన్న విషయంపై క్లారిటీ రానుంది. ఏపీకి హోదా విషయంలో దాగుడుమూతలు ఆడుతున్న బీజేపీ-టీడీపీలపై మాట్లాడే అవకాశం ఉంటుందని అంటున్నారు.
జనసేన పదవుల కోసం కాదు, ప్రశ్నించడానకే అనే నినాదంతో పవన్ 2014 ఎన్నికల్లో ప్రజల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ హోదా విషయంలో ఎందుకు ప్రశ్నించట్లేదో తెలియని పరిస్థితి ప్రజల్లో ఉంది. ఈ విషయమై రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర అంసతృప్తితో ఉన్నారు.
2019 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి
ఇదిలా ఉంటే 2019 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పవన్ దృఢనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులు కూడా ఇదే సరైన సమయమని భావిస్తున్నాయి. ఈలోపు ఎన్ని సినిమాలైతే అన్ని సినిమాలు తీసి అనంతరం పూర్తిసమయం రాజకీయాలకే కేటాయిస్తారని కొందరు పార్టీ కార్యకర్తలు, పెద్దలు చెబుతున్నారు.
సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ నయా ట్రెండ్ సెట్ చేయాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆయన వెంట నడిచేందుకు ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు సైతం క్యూ కట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
పలు జిల్లాలకు ఇన్ఛార్జ్లు నియమించే అవకాశం
అంతేకాదు ఈ సభాముఖంగా పలు జిల్లాలకు ఇన్ఛార్జ్లు నియమించే అవకాశాలు ఉందని తెలిసింది. తిరుపతితో పాటు జిల్లాల వారిగా బహిరంగ సభలు నిర్వహించాలని పవన్కు కార్యకర్తలు సూచించారు. దీనిపై పవన్ కూడా సానుకూలేంగా స్పందించినట్లు సమాచారం.
కాపు రిజర్వేషన్ ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ ఓ సూచన కూడా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అభిమానుల గొడవ విషయానికొస్తే వినోద్ను హతమార్చిన వారిని ఒక్కర్ని కూడా వదిలిపెట్టకుండా గురువారం తిరుపతి పర్యటనలో భాగంగా పవన్ కోలార్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
అభిమానులకు ఏం హితబోధ
వినోద్ హత్యతో తీవ్రంగా కలత చెందిన పవన్ ఇప్పుడు సభలో అభిమానులకు ఏం హితబోధ చేయనున్నారు. పవన్ యాంటీ-ఫ్యాన్స్కు ఏం హెచ్చరించనున్నారు.? అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. దీంతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రతిపక్షాలు పవన్పై చేస్తున్న విమర్శలు మొదలైన అంశాలను పవన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.
చివరగా పవన్ కళ్యాణ్ సభకు పోలీసుల అనుమతి కూడా లభించింది. సభను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తిరుపతి ఎస్పీ విజయలక్ష్మీ సూచించారు. పోలీసు బలగాలు సరిపడా లేవని జనసేన నేతలకు ఎస్పీ తెలిపారు. తమ పార్టీ వలంటీర్లతో సభ ప్రశాంతంగా నిర్వహించుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో పోలీసులు బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు.
శనివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పవన్
కాగా శనివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. అనంతరం జనసేన పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ వెనుక భారీ ప్లాన్తోనే పవన్ ముందడుగేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.