అవును చెప్పాను: నిజం ఒప్పుకున్న పవన్ కళ్యాణ్, కొంచెం భిన్నంగా (పిక్చర్స్)
విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా నుంచి వివిధ పార్టీల ఎంపీల వరకు చాలామంది పైన పొలిటికల్ పంచ్లు విసిరారు.
మోడీ భజన కాదు, చంద్రబాబుని ఇబ్బంది పెడతా: పంచ్ డైలాగులతో పవన్
ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా పైన ఎందుకు నిలదీయడం లేదని, సీబీఐ విచారణకు బయపడుతున్నారా అని ప్రశ్నించారు. మా ఎంపీలు (ఏపీ) చాలా ధనవంతులని, మురళీ మోహన్, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులను చూసి హోదా ఇవ్వకుండా ఉండవద్దని, ప్రజలు బీదవాళ్లని, వారిని చూసివ్వాలని కామెంట్ చేశారు.
తన పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన కామెంట్లకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. తనది జనసేన కాదని, మోడీ భజన సేన అని లెఫ్ట్ పార్టీతో పాటు వైసిపి నేతలు అంటున్నారని, అలాగే చంద్రబాబుకు మద్దతుగా ఉన్నానని చెబుతున్నారని, కానీ తనది ప్రజల భజన సేన అన్నారు. తనను కొందరు రబ్బర్ స్టాంప్ అన్నారని వైసిపి ఎమ్మెల్యే రోజా పేరును ప్రస్తావించకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన సభ కొంచెం భిన్నంగా జరిగింది. రాజకీయ సభలు అంటే ఆలస్యం ఉంటుంది. కానీ పవన్ సభ దాదాపు అనుకున్న సమయానికే ప్రారంభమైంది. వేదిక పైన పవన్ కళ్యాణ్ ఒక్కరు తప్ప మరెవరూ లేరు. అంతేకాదు, ఆయన గతం కంటే భిన్నంగా మాట్లాడారు. అందరిని చీల్చి చెండాడారు. అదే సమయంలో అందరి పైన గౌరవం ఉన్నట్లు చెప్పారు.
దటీజ్ పవన్ కళ్యాణ్
రాజకీయ పార్టీల సభలంటే నాయకులు ఆలస్యంగా వస్తారు. అంతా ఆలస్యం అవుతుంది. కానీ జనసేన తిరుపతి సభఇందుకు భిన్నంగా జరిగింది. నాలుగు గంటలకు సభ అంటే సరిగ్గా 4.10 గంటలకు పవన్ వేదిక వద్దకు వచ్చారు. ఒక్కడే వేదికపై నిలచి ప్రజలకు అభివాదం చేశారు. గంటకు పైగా మాట్లాడారు. జైహింద్ అంటూ సభను ముగించారు.
వేదికపై పవన్ ఒక్కడే
తన ప్రసంగంతో అభిమానుల్లో, ప్రజలను పవన్ ఉర్రూతలూగించారు. వేదికపై పవన్ ఒక్కడే ఉన్నారు. అభిమానులు, యువత ఎలా మాట్లాడాలని కోరుకుంటారో, పార్టీలకు అతీతంగా ఉండే సగటు మనిషి ప్రత్యేక హోదా విషయంలో ఎలా అభిప్రాయపడుతున్నాడో అలాగే మాట్లాడి అందరిని ఆకట్టుకున్నారు.
సభకు ప్లాన్ లేకున్నా..
తిరుపతిలో బహిరంగ సభ గురించి శనివారం ఉదయం వరకు ప్రజలకు తెలియకున్నా సభ మొదలయ్యే సరికి పెద్ద సంఖ్యలో యువత సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జన సమీకరణ కోసం ఏలాంటి ప్రయత్నాలు జరగకున్నా తుడా మైదానం పూర్తిగా జనంతో ప్రత్యేకించి యువతతో కిటకిటలాడిపోయింది.
పంచ్ డైలాగులు.. అశోక్ గజపతి రాజుకు కౌంటర్
విల్లు నుంచి వెలువడిన బాణం నోటి నుంచి జారిన మాటను వెనక్కు తీసుకోలేం అందుకే నేను ఆచితూచి మాట్లాడుతానని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం మంత్రి పదవి పోతే ఏముంది అంటూ అశోక గజపతి రాజును ప్రశ్నించిన సమయంలో విశ్వవిజేత అలెగ్జాండర్ పోతూ పోతూ ఒట్టి చేతులు చూపిన విషయాన్ని ప్రస్తావించారు.
మూడు దశల్లో పోరాటం
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కార్యాచరణను ప్రకటించారు. మూడు దశల్లో పోరాటం చేస్తామన్నారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. పద్నాలుగేళ్ల క్రితం బీజేపీ ఒక ఓటుకు రెండు రాష్ట్రాలంటూ తీర్మానాన్ని ప్రకటించిన కాకినాడలోనే సెప్టెంబరు 9వ తేదీన తొలి బహిరంగ సభ నిర్వహిస్తానని ప్రకటించారు. అక్కడి నుంచి ప్రతి జిల్లాలో సభలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. హోదా కోసం రాజకీయ పార్టీలతో కలిసి పోరాడేందుకు తాను సిద్ధమన్నారు.
పవన్ కళ్యాణ్ ఉద్వేగం.. వెంకయ్య, మోడీకి చురకలు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, ప్రయోజనాల కోసం మెడతెగి పడాల్సిందే కానీ ఇక అడుగు వెనక్కి పడదంటూ ఉద్వేగంగా మాట్లాడారు. గంటాకు పైగా సాగిన పవన్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలను తూర్పారబట్టారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని రాష్ట్ర విభజనపై మాట్లాడిన మోడీ.. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా చనిపోయిన తల్లికీ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
హ్యాట్సాప్.. జైరాంకు కౌంటర్
రాష్ట్ర ఎంపీలపైనా సెటైర్లు విసిరారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న రోజా వ్యాఖ్యలకూ గట్టి కౌంటర్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లు తాను మాట్లాడనని స్పష్టం చేశారు. తెలుగువారి తరపున రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రి అయిన జైరాం రమేశ్.. నవ్వుతూనే వారిని నిలువునా చీల్చారని మండిపడ్డారు. హ్యాట్సాప్ జైరాం అన్నారు.
సినిమాలతో రాజకీయం, ఇప్పుడే స్పందన వెనుక.
తాను సినిమాల్లో నటిస్తానని, అలాగే రాజకీయాలూ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హోదా పైన తాను రెండున్నరేళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నానో పవన్ చెప్పారు. పదేళ్ల తర్వాత కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిందని, తనకు ఆ పార్టీ సిద్ధాంతాలన్నా, ప్రధాని మోడీ అన్నా గౌరవముందని, అలాగే విభజన సందర్భంగా రాష్ట్రం మూడేళ్ల పాటు అగ్ని గుండంగా మారిందని, ఉద్యమాల కారణంగా ఎన్నో రంగాలు దెబ్బతిన్నాయని, రాష్ట్రం విడిపోయింది, టిడిపి కొత్తగా అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు మేలు చేస్తుందని ఆశించానని, హోదాను కేంద్రం ఇస్తుందని, అధికార టిడిపి సాధిస్తుందని నమ్మానని, రాష్ట్ర పరిస్థితిని చూసి మౌనంగా ఉన్నానని చెప్పారు. విల్లు నుంచి వెలువడిన బాణం, నోటి నుంచి జారిన మాట వెనక్కి తీసుకోలేమని, అందుకే ఆచితూచి అడుగేయాలని, మాట్లాడాలని ఇంతకాలం మౌనంగా ఉన్నానని చెప్పారు.
తప్పదని బయటకు వచ్చా.. కులం అంటగడతారా
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ముఖ్యంగా హోదా విషయంలో రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలకు విసుగుపుట్టి ఇక మాట్లాడకతప్పదని బయటకు వచ్చానని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఇక మడం తిప్పనని, తలతెగి పడాల్సిందే తప్ప అడుగు వెనక్కి పడదన్నారు. అమరావతిలో రైతుల పక్షాన పోరాడితే తన కులం వారి తరపున పోరాడానని కొందరు విమర్శించారని ఆక్షేపించారు. తనది మానవీయ కులమని, తనకు కులం అంటగట్టి మాట్లాడితే మంటెత్తుతుందని, ఇలాగే చేస్తే తన తీరు మరోలా ఉంటుందని హెచ్చరించారు.
అన్ని పార్టీలకు..
ఈ వేదికపై నుంచి టిడిపి, వైసిపి, రాష్ట్రంలోని మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నానని, అందరం కలిసి హోదా కోసం పోరాడుదామన్నారు. మీతో కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానని, ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికల తరువాత మరోలా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, డిపాజిట్లు కోల్పోతే ఒకలా, ఎన్నికల్లో పోటీ చేయకపోతే మరోలా మాట్లాడడం సరికాదన్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవడం మంచిది కాదన్నారు.
బీజేపీలో చేరమంటే వద్దన్నా
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని, కానీ తాను నిరాకరించానని తెలిపారు. తెలుగు ప్రజల శ్రేయస్సు కోసమే తాను జనసేన పెట్టానని, ఇతరుల జెండాలు, అజెండాలు మోయనని స్పష్టం చేశారు.
ఇప్పుడు ప్రశ్నిస్తా..
ఎప్పుడు ప్రశ్నిస్తావని కొందరు అడుగుతున్నారని, విమర్శలు చేసారని, ఇప్పుడు చెబుతున్నానని, 14 సంవత్సరాల కింద ఒక ఓటు- రెండు రాష్ట్రాలు అంటూ బీజేపీ ఎక్కడైతే తీర్మానం ప్రవేశపెట్టిందో ఆ కాకినాడ నుంచే ప్రశ్నించడం మొదలు పెడతానని, హోదా కోసం తన పోరాటం మూడు దశల్లో ఉంటుందని చెప్పారు. మొదటగా జిల్లాల వారీగా బహిరంగ సభలు పెట్టి హోదా ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టాలను, దాని సాధనలో రాజకీయ పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాను. సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలో తొలి బహిరంగ సభ జరుగుతుంది. రెండో దశలో రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేస్తాం. మూడో దశలో ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
మేడమ్ ప్లీజ్.. సార్ ప్లీజ్..
అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఎంపీలు మేడమ్.. మేడమ్ పీజ్ మేడమ్ అంటూ సోనియా గాంధీని ప్రాధేయపడేవారని, ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు సార్..సార్..సార్.. స్పెషల్ స్టేటస్ సార్ అంటూ ప్రధానిని యాచిస్తున్నారని, హోదా మన హక్కు అన్నారు. హక్కును అడుక్కోవడం ఏమిటన్నారు.
మొన్న నా ఒక్కడి వల్ల కాదన్నాను.. కానీ
తాను ఇటీవల తన ఒక్కడి వల్ల హోదా సాధ్యం కాదని చెప్పానని, తన బరువు 70 కేజీలేనని, కొడితే కిందపడిపోతానని, తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, కానీ అభిమానులే తన బలమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మీ బలంతోనే నేను పోరాడుతానని చెప్పారు. నేను ఒక్కడినే ఏం చేయగలనన్నది నిజమేనని, కానీ మీ అందరి అండతో పోరాడుతానని చెప్పారు. నా అభిమానులే నా బలమని, ఆడపడుచులే నా బలమని, అక్కచెల్లెళ్లే నా బలమన్నారు. అంతేతప్ప ఒక వ్యక్తిగా ఈ పవన్ గాడు ఏమీ లేడన్నారు.
నాలుగు ముక్కల హిందీ నేర్చుకోండి
ఎంపీలు నాలుగు ముక్కలు హిందీ నేర్చుకోవాలని, ఢిల్లీలో ఉండే నేతలు చాలా మందికి ఆంగ్లం రాదని,హిందీ మాత్రమే వచ్చునని, మన ఎంపీలకు హిందీ రాదని, కాబట్టి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పలేరని,సార్... సార్.. మేడమ్.. మేడమ్ ప్లీజ్...ప్లీజ్ అనడం మినహా ఏమీ చెప్పలేకపోతున్నారని, ఇప్పటికైనా నాలుగు ముక్కలు హిందీ నేర్చుకోవాలన్నారు.
ఆరు కోట్ల మంది వద్దంటే తెలంగాణ ఇచ్చారు
ముగ్గురు ముఖ్యమంత్రుల కోసం హోదా ఆపుదారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినప్పుడు ఆరు కోట్ల మంది అడ్డుపడ్డారని, అయినా అప్పుడు ఇచ్చారని, ఇప్పుడు కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులు అడ్డుకుంటున్నారని హోదా ఇవ్వరా అని నిలదీశారు. ఎవరి చెవిలో పువ్వులు పెడదామనుకుంటున్నారన్నారు. పవన్, పవన్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తన ప్రసంగించారు.
రోజాకు కౌంటర్
పవన్ తన ప్రసంగంలో రోజాపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రం కష్టాల్లో ఉంది కదా రాద్ధాంతమెందుకని నేను మౌనంగా పరిస్థితులు గమనిస్తుంటే తనను కొంతమంది విమర్శించారని, నువ్వు గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అన్నారని, పడతామబ్బా.. మాటలు పడతాం, ఎవరేమన్నా వింటామని, నేను నోటికి ఏదొస్తే అది మాట్లాడే మనిషిని కాదని, నోరుపారేసుకుంటే ఏమవుతుందని, సస్పెండై ఇంట్లో కూర్చోవలసి వస్తుందన్నారు. మిగిలిన తన పాతికేళ్ల జీవితాన్ని రాష్ట్రం కోసం, దేశం కోసం అంకితమిస్తున్నానని చెప్పారు.